logo

తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి మాయం

తల్లి ఒడిలో నిద్రిస్తున్న 11 నెలల చిన్నారి అదృశ్యమైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం కలకలం రేపింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 22 May 2024 05:18 IST

గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ఫిర్యాదు

సాయిదేవాన్ష్‌

సత్తుపల్లి, న్యూస్‌టుడే: తల్లి ఒడిలో నిద్రిస్తున్న 11 నెలల చిన్నారి అదృశ్యమైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం కలకలం రేపింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన వానరాసి జంపన్న, దుర్గ దంపతులు వారం కిందట బతుకుదెరువు కోసం తమ చిన్నారి సాయిదేవాన్ష్‌ను తీసుకుని సత్తుపల్లికి వలసవచ్చారు. స్థానిక గుడిపాడు రోడ్డు శివారులోని ప్రైవేటు భూముల్లో డేరాలు వేసుకుని తలదాచుకుంటున్నారు. జంపన్న గ్యాస్‌ పొయ్యిలను రిపేర్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే తమ గుడారంలో సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 11గంటల సమయంలో దుర్గ లేచి కుమారుడికి పాలిచ్చి దుప్పటి కప్పి పడుకోబెట్టింది. తిరిగి ఒంటి గంటకు లేచి చూసేసరికి సాయిదేవాన్ష్‌ కన్పించలేదు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి తన భర్తతో కలిసి చుట్టు పక్కల డేరాలు వేసుకున్న వారి వద్దకు వెళ్లి ఆరా తీశారు. స్థానికులతో కలిసి ఆ ఏరియా మొత్తాన్ని జల్లెడపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో ఠాణాకు వెళ్లి తమ కుమారుడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి ఉండొచ్చనే అనుమానంతో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఐ టి.కిరణ్‌ నేతృత్వంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మంగళవారం దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న నిఘానేత్రాల సాయంతో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా గత నాలుగైదు రోజులుగా తాము నివాసం ఉండే ప్రాంతానికి సాయంత్రం సమయంలో ఓ కారు వస్తోందని, అందులో ఓ వ్యక్తి రాత్రి వరకు ఉండి వెళ్లిపోతున్నాడని, అతడే రెక్కీ చేసి చిన్నారిని కిడ్నాప్‌ చేసి ఉండొచ్చని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు కన్పించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని