రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
మహబూబ్నగర్ : ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి
ఈనాడు, మహబూబ్నగర్-పాలమూరు, న్యూస్టుడే: వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం నుంచి రూ.30వేల కోట్లు రాబట్టేలా పోరాటం చేస్తామన్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా సీఎం శుక్రవారం మహబూబ్నగర్కు వచ్చారు. క్లాక్టవర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గద్వాల గడీల నుంచి ఓ దొరసాని మహబూబ్నగర్ వచ్చారని వారి కాళ్ల వద్ద ఇంకా బతుకుదామా? అని ప్రశ్నించారు. ఆ దొరసాని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలైందిగానీ పాలమూరు పథకానికి జాతీయ హోదా మాత్రం తీసుకురాలేదని డీకే అరుణను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆమెకు పదవులొస్తే ఆ కుటుంబానికే మేలు జరుగుతుందని ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఈ పదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరును ఎడారిగా మార్చాయని ఆరోపించారు. మహబూబ్నగర్లో భారాస, భాజపా ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయన్నారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు పాలమూరు మట్టిపని, తట్టపని గుర్తుకొచ్చేవన్నారు. ఇప్పుడు తాను ఇతర రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్తున్నానని, పాలమూరు పౌరుషం ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ పాలమూరులోని ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు. ఈ ప్రాంతానికి కనీసం పరిశ్రమలను కూడా తీసుకురాలేదన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్నగర్లో పాలమూరు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే అందులో 150 పోస్టులకు 120 ఖాళీగా ఉంచారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చిన్నారెడ్డికి ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ను, ఒబేదుల్లా కొత్వాల్కు మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ను ఇచ్చుకున్నామని గుర్తు చేశారు. ఆగస్టు 15 లోగా ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తామని తెలిపారు. నల్లమల బిడ్డగా ఈ ప్రాంత గాలి, నీరు, నేల నాది అన్నారు. ఈ ప్రాంతానికి ఏమైనా జరిగితే నాకున్న బాధ ఎవరికైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. తాను రాజైనా పాలమూరుకు బిడ్డనే అని చెప్పారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వంశీచంద్రెడ్డి, మల్లు రవిలను గెలిపించాలన్నారు.
ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన ఈ మూడు నెలల్లో పాలమూరుకు మక్తల్-నారాయణపేట- కొడంగల్ ఎతిపోతల పథకం, మహబూబ్నగర్లో ఇంజినీరింగ్, న్యాయ కళాశాలలను మంజూరు చేసుకున్నామన్నారు. సారా వైపు ఉంటారా.. సాగునీరు అందించే వైపు ఉంటారా? పార్టీలు మార్చే రాజకీయ అవకాశవాదుల వైపు ఉంటారా.. పార్టీ కోసం ప్రాణాలిచ్చే వారి పైపు ఉంటారా? అంటూ భాజపా అభ్యర్థి డీకే అరుణనుద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు అవకాశం ఇస్తే దిల్లీలో పాలమూరు ప్రజల గొంతు వినిపిస్తానన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ మాట్లాడుతూ మహబూబ్నగర్లో భాజపాకు ఓటేస్తే సారా, ఇసుక, క్రషర్, భూకబ్జాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి జితేందర్రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్నికరెడ్డి, అనిరుధ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, శంకర్, ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.
మెట్టుగడ్డ చౌరస్తాలో కార్యకర్తల సత్కారం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి
రోడ్ షో..: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్డు షోకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. మెట్టుగడ్డ నుంచి సీఎం ర్యాలీ ప్రారంభమైంది. ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి వస్తుండటంతో ఉదయం 9 గంటలకే మెట్టుగడ్డ చౌరస్తాలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానాలు చేరుకున్నారు. చౌరస్తా కిక్కిరిసిపోయింది. క్లాక్టవర్ వద్ద ముఖ్యమంత్రికి ముదిరాజ్లు చేపను బహూకరించారు. బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మారుస్తామని చెప్పడంతో ముదిరాజ్లు హర్షం వ్యక్తం చేశారు. సభలో వంశీచంద్ ప్రసంగిస్తుండగా మజీదు నుంచి నమాజ్ ప్రారంభం కావడంతో ప్రసంగం ఆపారు. నమాజ్ ముగియగానే మళ్లీ ప్రసంగం ప్రారంభమైంది. సభ ముగిసిన అనంతరం కలెక్టరేట్కు వెళ్లి సీఎంతో కలిసి వంశీచంద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్లో ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు.
, చల్లా వంశీచంద్రెడ్డి, చిత్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శంకర్.. క్లాక్టవర్లో జరిగిన కార్నర్ సమావేశానికి హాజరైన జనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు