logo

చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్‌ మృతి

అనారోగ్యంతో గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఓ ఆటో డ్రైవర్‌ బుధవారం రాత్రి మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా..

Published : 24 Mar 2023 05:13 IST

వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడని బాధితుల ఆందోళన

దౌలత్‌ (పాత చిత్రం), ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ కిశోర్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల అర్బన్‌, న్యూస్‌టుడే :  అనారోగ్యంతో గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఓ ఆటో డ్రైవర్‌ బుధవారం రాత్రి మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. గుండె పోటుతో చనిపోయినట్లు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ కిశోర్‌ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గద్వాల పుర పరిధి మోమిన్‌ మహల్లా కాలనీకి చెందిన దౌలత్‌ (35) ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. ఈ నెల 21న అనారోగ్యంతో పాటు మల, మూత్ర సమస్యతో బాధపడుతూ గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందారని, వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం ఆసుపత్రి వద్ద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని పర్యవేక్షకులు డాక్టర్‌ కిశోర్‌తో పాటు వైద్య సేవలందిచిన వైద్యులతో మాట్లాడారు. రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పరిపాటిగా మారిందని, పని తీరుమార్చుకోవాలని హితవు పలికారు. ఆసుపత్రి పర్యవేక్షకులు మాట్లాడుతూ మల, మూత్రం రాక బాధపడుతున్న దౌలత్‌కు అన్ని రకాల పరీక్షలు చేశామని, సిటీ స్కాన్‌లో కూడా ఎలాంటి ప్రతికూల ఫలితం రాలేదని, బుధవారం రాత్రి గుండెపోటుకు గురికావడంతోనే మృతి చెందారని వివరించారు. వైద్య సేవల్లో డాక్టర్‌ నిర్లక్ష్యం లేదని తెలిపారు. బాధిత బంధువుల ఆరోపణలతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు వైద్య సేవలందించిన డాక్టర్‌ భార్గవ వ్యాస్‌కు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా తాఖీదు ఇచ్చినట్టు కిశోర్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని