logo

ఉజ్వల భవితకు పాలిటెక్నిక్‌..

పాలిటెక్నిక్‌.. ఉజ్వల భవితను సొంతం చేసుకునేందుకు మార్గం చూపే కోర్సు. పదో తరగతి పూర్తవగానే అత్యధికులు ఇంటర్‌లో చేరాలని అనుకుటారు. కానీ కొందరు మాత్రం పాలిటెక్నిక్‌ వైపు మొగ్గుచూపుతారు.

Published : 21 Apr 2024 01:06 IST

22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

ఓ పాలిటెక్నిల్‌లో చదువుకుంటున్న విద్యార్థులు

 న్యూస్‌టుడే, చేగుంట: పాలిటెక్నిక్‌.. ఉజ్వల భవితను సొంతం చేసుకునేందుకు మార్గం చూపే కోర్సు. పదో తరగతి పూర్తవగానే అత్యధికులు ఇంటర్‌లో చేరాలని అనుకుటారు. కానీ కొందరు మాత్రం పాలిటెక్నిక్‌ వైపు మొగ్గుచూపుతారు. త్వరగా ఉపాధి పొందే వీలుండటంతో పాటు ఇంజినీరింగ్‌లో నేరుగా రెండు ఏడాదిలో చేరడానికి అవకాశం ఉండటమే ప్రధాన కారణం. ప్రస్తుతం పాలిసెట్‌ దరఖాస్తు గడువు సమీపించింది. ఈనెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివిధ కోర్సులు: పాలిటెక్నిక్‌లో మూడేళ్ల వ్యవధితో కూడిన డీఈఈఈ, డీఎంఈ, డీసీఎంఈ, సివిల్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి డిప్లొమా కోర్సులు ఉన్నాయి. మూడేళ్లు శ్రమించి మంచి ఉత్తీర్ణత సాధిస్తే క్యాంపస్‌ సెలక్షన్స్‌ నిర్వహించి పలు కంపెనీలు ఉద్యోగాల్లో చేర్చుకునే అవకాశం లేకపోలేదు. లేదంటే ఈసెట్‌ రాసి బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలోకి చేరే అవకాశం ఉంది.

14 చోట్ల..: ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ 14 పాలిటెక్నిక్‌లు కొనసాగుతున్నాయి. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉంటాయి. చేగుంట, గోమారం, హుస్నాబాద్‌ (కో-ఎడ్యుకేషన్‌), గజ్వేల్‌, సిద్దిపేట, జోగిపేట, నారాయణఖేడ్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌, వికారాబాద్‌ (బాలురు), మెదక్‌, సిద్దిపేట, జోగిపేట (బాలికలు)ల్లో పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. అన్ని చోట్ల ల్యాబ్‌ సౌకర్యం ఉండటంతో విద్యార్థులకు ఉపయోగంగా మారింది.

వసతిగృహాలు సైతం..: పాలిటెక్నిక్‌లు ఉన్న చోట ప్రభుత్వం వసతిగృహాలనూ ఏర్పాటు చేసింది. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రయోజనంగా మారింది. ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించడంతో వీటిల్లో ఎంచక్కా చేరి ఇష్టమైన కోర్సు చేసే వీలుంది. జెన్‌కో, ఎన్టీపీసీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, రైల్వే, సింగరేణి, ఐఓసీఎల్‌, బీహెచ్‌్ఈఎల్‌ వంటి సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో క్లర్క్‌ కొలువులు లభిస్తాయి. ఐటీఐ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌లో ఇస్ట్రక్టర్‌గా పని చేయవచ్చు. ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో చేరి ఆపై ప్రాంగణ నియామకాలకు వెళ్తే పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.


సద్వినియోగం చేసుకోవాలి:

చక్రవర్తి, ప్రిన్సిపల్‌, చేగుంట

పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవితకు తోడ్పడుతుంది. దరఖాస్తు చేసుకోవటానికి గడువు సమీపించింది. పది పరీక్షలు రాసి ఆసక్తి ఉన్న వారు ముందుకు రావాలి. అన్ని చోట్ల సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశారు. సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని