logo

ఓట్ల లెక్కింపు కేంద్రానికి పటిష్ఠ భద్రత

మాచర్ల ఎన్నికల గొడవ నేపథ్యంలో అధికారులు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ముందస్తుగా భద్రతపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Updated : 26 May 2024 06:36 IST

స్ట్రాంగ్‌ రూం వద్ద.. 

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: మాచర్ల ఎన్నికల గొడవ నేపథ్యంలో అధికారులు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ముందస్తుగా భద్రతపరమైన చర్యలు తీసుకుంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల ప్రవేశంపై పూర్తిగా నిషేధం విధించారు. మూడు రకాల భద్రత ఏర్పాట్లు చేశారు. 24 గంటలపాటు డీఎస్పీ స్థాయి పోలీసు అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. 

24 గంటలూ పహారా

జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రంగా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలను భద్రపరిచారు.    రిటర్నింగ్‌ అధికారిగా జిల్లా కలెక్టర్‌ క్రాంతి వల్లూరు వ్యవహరిస్తున్నారు. 

  • స్ట్రాంగ్‌రూంల వద్ద సీఆర్‌పీఎఫ్, లోపలికి వెళ్లే రెండో గేటు వద్ద ఆర్మ్‌డ్‌ రిజర్వు దళాలు, ప్రథమ గేటు ప్రవేశం వద్ద సివిల్‌ పోలీసులు పహారా ఉంటున్నారు. లోనికి వెళ్లే సందర్భంలో ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. 24 గంటలపాటు డీఎస్పీ, సీఐలతో పహారా ఉండేలా చర్యలు తీసుకున్నారు.  

సీసీ కెమెరాల అనుసంధానం

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలోని అన్ని ప్రాంతాల్లో, మూడు గేట్లకు, స్ట్రాంగ్‌ రూంల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని ఆన్‌లైన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల అదనపు కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ కౌంటింగ్‌ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. కలెక్టర్‌ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్‌కుమార్‌లు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు