logo

ఇక రహదారులకు మహర్దశ

తెలంగాణ దక్షిణ ప్రాంత ప్రగతికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మంగళవారం దిల్లీలో కలిసి పలు విషయాలపై విజ్ఞప్తి చేయడాన్ని పేర్కొనవచ్చు.

Published : 22 Feb 2024 02:10 IST

విస్తరణకు నోచుకోనున్న మన్నెగూడ-వికారాబాద్‌-తాండూరు-జహీరాబాద్‌-బీదర్‌ మార్గాలు

న్యూస్‌టుడే, తాండూరు, జహీరాబాద్‌: తెలంగాణ దక్షిణ ప్రాంత ప్రగతికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మంగళవారం దిల్లీలో కలిసి పలు విషయాలపై విజ్ఞప్తి చేయడాన్ని పేర్కొనవచ్చు. దీన్లో దక్షిణ భాగం పరిధిలోకి వచ్చే రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)లతో పాటు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతుల మంజూరు కోరారు. అలాగే ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయడం గురించి చర్చించారు. దీనివల్ల వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాలకు కలిగే ప్రయోజనాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

134 కి.మీ. పొడవు: జాతీయ రహదారులుగా విస్తరించాల్సిన రాష్ట్ర రహదారుల జాబితాలో 134 కి.మీ. పొడవు కలిగి జిల్లా పరిధిలోకి వచ్చే మన్నెగూడ-వికారాబాద్‌-తాండూరు, సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జహీరాబాద్‌-బీదర్‌ రహదారులున్నాయి. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ప్రతిపాదిత రోడ్లు నాలుగు వరుసలతో జాతీయ రహదారులుగా మారితే జిల్లా రవాణా అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తుంది.  

ముంబయి జాతీయ రహదారికి అనుసంధానం: రాష్ట్ర రహదారి తాండూరు నుంచి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ వరకు ఉన్న 50 కి.మీ.రోడ్డు కూడా రెండు వరుసలదే. ఇది జహీరాబాద్‌లో ముంబయి-హైదరాబాద్‌ జాతీయ రహదారికి అనుసంధానమౌతుంది. వాహనాల రాకపోకలు ఎక్కువే. చాలా చోట్ల ప్రస్తుతం ఉన్న రోడ్డు గుంతల మయంగా మారింది. ఇందూరు వద్ద ప్రయాణం నరకంగా ఉంటోంది.

జహీరాబాద్‌-బీదర్‌ మార్గ విస్తరణకు 2017లోనే నిర్ణయం: జహీరాబాద్‌ నుంచి కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా కేంద్రం వరకు 30 కి.మీ. పొడవుతో ఉన్న మార్గాన్ని జాతీయ రహదారిగా విస్తరించాలని 2017లోనే నిర్ణయించారు. ఈ రోడ్డును ముంబయి-హైదరాబాద్‌ రహదారికి అనుసంధానం చేయాలన్నది ఉద్దేశం. అప్పట్లో హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ రహదారి కాంగ్రెస్‌ సదస్సులో ప్రస్తుత కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. జహీరాబాద్‌-బీదర్‌ రహదారిని నాలుగు వరుసల రహదారిగా మార్చాలని ఆయనే ప్రకటించారు. కొన్ని రోజులకు ఈ విషయమై అప్పటి రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు. 2018లో రహదారి విస్తరణ జరుగుతుందని భావించారు. కాని కుదరలేదు. తాజాగా ముఖ్యమంత్రి విస్తరణపై చొరవ చూపారు.  

జిల్లా కేంద్రంగా ఉన్న కర్ణాటక రాష్ట్ర బీదర్‌ పెద్ద పట్టణమే. వచ్చి పోయే వాహనాలు ఎక్కువే. బీదర్‌ నుంచి జహీరాబాద్‌కు రహదారి విస్తరణ జరిగితే వాహనదారులకు మరింత సౌకర్యంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని