logo

అసంపూర్తి పనులతోనే పాలన

స్వగ్రామంలోనే అన్నిరకాల ప్రభుత్వ సేవలు పొందటానికి వీలుగా సచివాలయాలు, వెల్‌నెస్‌(విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌), రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. స్థానికంగా నేరుగా సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.

Updated : 13 Apr 2024 05:59 IST

వినియోగంలోకి రాని నాయుడుపల్లిలో సచివాలయ భవనం

దుత్తలూరు, న్యూస్‌టుడే : స్వగ్రామంలోనే అన్నిరకాల ప్రభుత్వ సేవలు పొందటానికి వీలుగా సచివాలయాలు, వెల్‌నెస్‌(విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌), రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. స్థానికంగా నేరుగా సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉన్నా గత మూడేళ్ల నుంచి నిర్మాణాలు చేపట్టిన చాలా చోట్ల ఇంకా భవనాలు అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. హడావుడిగా శంకుస్థాపనలు, శిలాఫలకాలు వేసి ఫొటోలతో ప్రచారం చేసుకున్నారు. ఇదే సందర్భంలో వాటిని సకాలంలో పూర్తి చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చూపారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో భవనాలు పూర్తిగాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉదయగిరి నియోజకవర్గ పరిధి ఎనిమిది మండలాల్లో 143 పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 93 సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే సంఖ్యలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవనాలను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. భవన నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారులకు సకాలంలో నిధులు చెల్లించలేదు. దీంతో నిర్మాణాలన్నీ అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. 93 సచివాలయ భవనాల్లో 16 చోట్ల అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాలు 19 చోట్ల, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు 23 అసంపూర్తిగా ఉన్నాయి. భవనాలు అసంపూర్తిగా ఉన్నచోట్ల అధికారులు పాత పంచాయతీ కార్యాలయాలు, అద్దె భవనాల్లో సచివాలయాలతోపాటు రైతు భరోసా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వాటిలో తగిన సౌకర్యాలు లేవు. చాలా భవనాలకు ఫ్లోరింగ్‌ టైల్స్‌, తలుపులు, విద్యుత్తు, రంగులు తదితర పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ భవనాలు ఎపుడు పూర్తయి, వినియోగంలోకి వస్తాయోనని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని