logo

నిందితుడి దాడిలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు

కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ ఠాణాలో బాలిక కిడ్నాప్‌ కేసు దర్యాప్తులో పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు.

Published : 28 May 2024 06:09 IST

గాయపడిన కానిస్టేబుల్‌ను కొరాపుట్‌కు తరలిస్తున్న సిబ్బంది 

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ ఠాణాలో బాలిక కిడ్నాప్‌ కేసు దర్యాప్తులో పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. ఒక నిందితుడి దాడిలో కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. నందపూర్‌ ఎస్‌డీపీవో సంబిత్‌కుమార్‌ మజ్జి అందించిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలిక ఇటీవల కిడ్నాప్‌కు గురైంది. నందపూర్‌కు చెందిన రమేష్‌ గుంట అపహరించినట్లు బాధిత కుటుంబీకులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి బాలికను, రమేష్‌తోపాటు ఆయనకు సహాయం చేసిన పాత్రపండికు చెందిన సయిన్‌ఖాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తుండగా రమేష్‌ గోడ దూకి పరారయ్యాడు. ఆయన కోసం గాలిస్తుండగా ఠాణాలో ఉన్న మరో నిందితుడు సయిన్ఖ్‌ాన్‌ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ భుసిత్‌ టకిరిపై సమీపంలో ఉన్న తుపాకీతో దాడి చేసి తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలైన కానిస్టేబుల్‌ను ప్రథమ చికిత్స అనంతరం కొరాపుట్‌లోని లక్ష్మణ్‌ నాయక్‌ వైద్య కళాశాలకు తరలించారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్‌ భుసిత్‌ ఒక్కడే విధులు నిర్వహిస్తున్నారు. పరారైన సయిన్‌ఖాన్‌ కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. సోమవారం ఉదయం బిలాపుట్‌లో ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని