logo

ఆక్వా రైతు విలవిల

విద్యుత్తు బిల్లులు చెల్లించనివారితో పాటు కట్టినవారికి సైతం అధికారులు సరఫరా నిలిపివేయడంతో దాదాపు రూ.50 లక్షల వరకు ఆక్వా రైతులు నష్టపోయిన ఉదంతమిది.

Published : 30 Nov 2022 02:07 IST

విద్యుత్తు కనెక్షన్‌ తీసివేయడంతో రూ.50 లక్షల నష్టం

చెరువుల్లో ఆక్సిజన్‌ పడిపోవడంతో మధ్యంతరంగా రొయ్యలు పట్టించి విక్రయిస్తున్న రైతులు

టంగుటూరు, న్యూస్‌టుడే: విద్యుత్తు బిల్లులు చెల్లించనివారితో పాటు కట్టినవారికి సైతం అధికారులు సరఫరా నిలిపివేయడంతో దాదాపు రూ.50 లక్షల వరకు ఆక్వా రైతులు నష్టపోయిన ఉదంతమిది. టంగుటూరు మండలం పసుపుకుదురులో జేసీ ఆక్వా పేరిట 15 విద్యుత్తు సర్వీసులున్నాయి. ఇటీవల కొన్ని ఆక్వా చెరువుల పంట కాలం ముగియడంతో సాగుదారులు విరామం  ప్రకటించారు. వారిలో కొందరు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఏడీ మోహన్‌రావు, టంగుటూరు అర్బన్‌ ఏఈ రామకృష్ణ, సిబ్బందితో వచ్చి సరఫరా నిలిపివేశారు. అయితే విద్యుత్తు బిల్లు చెల్లించిన ఎస్‌.మాల్యాద్రిరెడ్డి, మరో రైతు చెరువులకు కూడా నిలిపివేయడంతో వారు లబోదిబోమన్నారు. మాల్యాద్రిరెడ్డి మాట్లాడుతూ తాము పది ఎకరాల చెరువులను లీజుకు తీసుకొని ఆక్వా పంట వేశామన్నారు. మూడెకరాల వరకు పంట విక్రయించగా మరో ఏడు చెరువులు సాగులో ఉన్నాయన్నారు. బిల్లు చెల్లించినా సరఫరా ఆపివేయడంతో విద్యుత్తు లేక చెరువుల్లో ఆక్సిజన్‌ శాతం పడిపోయిందన్నారు. నాలుగు గంటల పాటు జనరేటర్లు వినియోగించి ఏరియేటర్లను తిప్పామన్నారు. డీజిల్‌ ధర అధికంగా ఉండటంతో ఖర్చు మరింత పెరిగే అవకాశముందని భావించి మంగళవారం పంట విక్రయానికి సిద్ధమయ్యామన్నారు. ప్రస్తుత పరిస్థితి వల్ల రూ.50 లక్షల పెట్టుబడిని నష్టపోవాల్సి వచ్చిందని వాపోయారు. బిల్లు చెల్లించినవారి వరకు విద్యుత్తు ఇచ్చి ఉంటే తమకు ఈ నష్టం వచ్చి ఉండేది కాదన్నారు. ఏడీ మోహన్‌రావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా జేసీ ఆక్వా పేరిట ఉన్న సర్వీసులకు రూ.19.55 లక్షల బకాయిలు ఉన్నాయన్నారు. వాటిలో 5 సర్వీసులకు రూ.5.23 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించి మిగతా పదింటికి చెల్లించలేదన్నారు. ఈ కారణంగా ఆ సర్వీసులు తొలగించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని