logo

రెండ్రోజుల్లో జమ్ముకశ్మీర్‌కు వెళ్లనుండగా... జవాన్‌ను కబళించిన మృత్యువు

కుమారుడు అయిదు నెలల కిందట పుట్టాడు. ఆ చిన్నారి బాలుడిని చూసేందుకు 20 రోజుల కిందట స్వస్థలానికి వచ్చారు ఆర్మీ జవాను మనోజ్‌కుమార్‌ (31). పోరుమామిళ్లలో శుక్రవారం జరిగే సంతకు తెలిసిన మరో ఇద్దరితో కలిసి వచ్చారు.

Published : 24 Feb 2024 04:02 IST

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: కుమారుడు అయిదు నెలల కిందట పుట్టాడు. ఆ చిన్నారి బాలుడిని చూసేందుకు 20 రోజుల కిందట స్వస్థలానికి వచ్చారు ఆర్మీ జవాను మనోజ్‌కుమార్‌ (31). పోరుమామిళ్లలో శుక్రవారం జరిగే సంతకు తెలిసిన మరో ఇద్దరితో కలిసి వచ్చారు. వెంటాడిన మృత్యువు వాహనం రూపంలో ఆర్మీ జవానును కబళించింది. హృదయవిదారకరమైన ఘటనకు సంబంధించి ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి వివరాల మేరకు.. బేస్తవారపేట మండలం గలిజేరుగుళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాను మనోజ్‌కుమార్‌కు భార్య లక్ష్మి, అయిదు నెలల కుమారుడు ఉన్నాడు. కుమారుడిని చూసేందుకు 20 రోజుల కిందట స్వగ్రామానికి వచ్చారు. మరో రెండు రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో విధుల్లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో పోరుమామిళ్లలో సంత చూసేందుకు అంజి, తిరుపతయ్య అనే ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో వచ్చారు. అనంతరం అదే మార్గంలో సాయంత్రం తిరిగి వెళుతుండగా రామిరెడ్డికుంట వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన అంజిని, తిరుపతయ్యను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మనోజ్‌కుమార్‌ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటన తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని