logo

ఇట్లుంటది జగన్‌ తోని.. ఒంగోలు బ్రాండ్‌కే బ్యాండ్

 రాజసానికి మారు పేరైన ఒంగోలు గిత్త.. వేల మందికి ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ.. ఈ రెండూ జిల్లాకు ఓ బ్రాండ్లు. ఆ పేర్లు తలుచుకుంటే ప్రకాశం వాసుల మది పులకరిస్తుంది. ఎనలేని సంతోషం, ఉత్సాహం కలుగుతుంది.

Updated : 23 Apr 2024 09:05 IST

పాల డెయిరీకి ఏకంగా పాడె కట్టారు
ఎద్దుల ఊసే పట్టని వైకాపా సర్కారు
విధానాలతో విలవిల్లాడిన పశు పోషకులు

 రాజసానికి మారు పేరైన ఒంగోలు గిత్త.. వేల మందికి ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ.. ఈ రెండూ జిల్లాకు ఓ బ్రాండ్లు. ఆ పేర్లు తలుచుకుంటే ప్రకాశం వాసుల మది పులకరిస్తుంది. ఎనలేని సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. పాదయాత్ర వేళ ఆదుకుంటానంటూ మొసలి కన్నీరు కార్చిన జగన్‌.. గద్దెనెక్కిన తర్వాత తన అసలు స్వరూపాన్ని బయట పెట్టారు. కూల్చడమే తప్ప కట్టడం తెలియదు. కడుపులు మాడ్చడమే తప్ప నింపేందుకు మనసు రాదు. అవకాశాలున్నా.. అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేయలేదు. ప్రకాశానికి పెద్ద పరిశ్రమలు ఒక్కటీ తేలేదు. సరికదా ఉన్నవీ బతకనివ్వలేదు. పదుగురికి బతుకునిచ్చే ఒంగోలు పాల డెయిరీకి పాడె కట్టారు. వందల మంది ఉద్యోగులు, కార్మికులను రోడ్డున పడేశారు. వేల సంఖ్యలోని రైతు కుటుంబాలకు ఉన్న ఏకైక పెద్ద దిక్కును మూసేయించారు. జిల్లాకు ప్రపంచ స్థాయిలోనే ఓ గుర్తింపుగా నిలిచిన ఒంగోలు జాతి గిత్తల సంరక్షణ ఊసే మరిచారు. వాటి మనుగడకే ముప్పు వాటిల్లుతున్నా ఉలుకూ పలుకు లేకుండా ఉండిపోయారు. మొత్తానికి ఒంగోలు బ్రాండ్‌కే బ్యాండ్‌ వేసి.. ఇట్లుంటది వినాశకారి జగన్‌ తోని అని అంతా చెప్పుకొనేలా చేశారు.

 ఈనాడు, ఒంగోలు


గిత్త.. పట్టించుకోనేలేదట...

ఒంగోలు గిత్తలు, ఆవుల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చేపట్టిన ప్రత్యేక చర్యలేమీ లేవు. ప్రపంచంలోనే మేలు రకం జాతిగా ‘ఒంగోలు’కు పేరు. ఇటువంటి వాటిని పరిరక్షించి మరింత అభివృద్ధి చేసేలా పాటుపడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా పట్టించుకోలేదు. దీంతో గతంలో రెండు లక్షలకు పైగా ఉన్న గిత్తల సంఖ్య ప్రస్తుతం 50 వేలకు పడిపోయింది. పశువుల మేతకు వీలుగా ఉన్న బీడు భూములను కూడా వైకాపా నేతలు చాలా వరకు ఆక్రమించారు. వాటికి మేత కూడా దొరికే పరిస్థితి లేకపోయింది.

వినాశకారి విఫల ప్రయోగం...

జగన్‌ సర్కారు 2020లో పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంచి ధర ఇస్తామని జిల్లా కలెక్టర్‌ నుంచి సచివాలయ సిబ్బంది వరకు అందరితో పెద్ద ఎత్తున ప్రచారం చేయించింది. ఒంగోలు డెయిరినీ అమూల్‌కు కట్టబెట్టి.. 176 పాల కేంద్రాల నుంచి నిత్యం పాలను సేకరించేలా ప్రణాళిక రచించింది. చెప్పిన ధర చెల్లించకపోవడం, పెద్దమొత్తంలో బకాయిలు పేరుకుపోవడం, కొన్ని మండలాల్లో మాత్రమే సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి కారణాలతో పాడి రైతులు మొగ్గు చూపలేదు. ఫలితంగా ఇందులో దాదాపు సగం కేంద్రాలు మూతపడ్డాయి. ‌్ర తాళ్లూరు మండలంలో మొత్తం 21 కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. అందులో 13 నిరుపయోగంగా మారాయి. ‌్ర ముండ్లమూరు మండలంలో 22 కేంద్రాలు ఏర్పాటు చేస్తే అందులో 11 అలంకారప్రాయంగా మిగిలాయి.

లక్ష మంది జీవితాల్లో  చీకట్లు...

బహిరంగ మార్కెట్‌లో రూ. వేల కోట్ల విలువైన ఆస్తులున్న ఒంగోలు డెయిరీ జిల్లాలోని పాడిరైతులకు గతంలో ఓ వరం. ఆసియాలోనే రెండో అతి పెద్దదిగా పేరు. మూడు లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన పౌడర్‌ ప్లాంట్‌తో పాటు, రోజుకు ఆరు లక్షల లీటర్ల పాల సేకరణతో లక్ష మంది జీవితాల్లో వెలుగులు నింపింది. మితిమీరిన రాజకీయ జోక్యంతో క్రమంగా ప్రాభవం కోల్పోయింది. గత తెదేపా ప్రభుత్వం గాడిన పెట్టే ప్రయత్నం చేసింది. అధికారులతో కూడిన పాలకవర్గాన్ని నియమించి రూ.35 కోట్ల నిధులు కేటాయించింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వస్తానే అమూల్‌కు కట్టబెట్టింది. రోజుకు 18 వేల లీటర్లు పాలు సేకరిస్తున్న పరిస్థితిని పెంచాల్సిన అమూల్‌ నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదంటూ ఏకంగా మూసేసింది. దీంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. లక్ష మంది రైతుల జీవితాలకు భరోసాగా నిలిచిన ప్లాంట్‌ కొండెక్కింది.

తుప్పు పడుతున్న డెయిరీలోనివిలువైన యంత్ర పరికరాలు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని