logo

పిల్లల వద్దకే ప్రయోగశాల!

పాఠశాల నుంచి బయటికెళ్లేలోపే పరిశోధనలు, ప్రయోగాలపై మంచి అవగాహన విద్యార్థుల్లో కలిగించేలా తమిళనాడు ప్రభుత్వం కీలక పథకాన్ని అమల్లోకి తెచ్చింది.

Published : 01 Dec 2022 00:45 IST

తమిళనాడు పాఠశాలల్లో వినూత్న ప్రయోగం
విద్యార్థుల్లో అవగాహన పెంచేలా వాలంటీరు వ్యవస్థ
- ఈనాడు-చెన్నై

ద్విచక్రవాహనాలపై మొబైల్‌ ప్రయోగశాల కిట్లతో స్టెమ్‌ ఫెసిలిటేటర్లు

పాఠశాల నుంచి బయటికెళ్లేలోపే పరిశోధనలు, ప్రయోగాలపై మంచి అవగాహన విద్యార్థుల్లో కలిగించేలా తమిళనాడు ప్రభుత్వం కీలక పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉన్నత పాఠశాలల్లో ‘సైన్స్‌, టెక్నాలజీ ఇంజినీరింగ్‌ అండ్‌ మ్యాథమేటిక్స్‌ (స్టెమ్‌)’ విధానాన్ని ప్రవేశపెట్టింది. వారికి అవసరమైన ల్యాబొరేటరీల్ని ప్రత్యేక ద్విచక్రవాహనాలపై, ఇతర విధానాల్లో ప్రయోగ పరికరాల్ని అందుబాటులో ఉంచనుంది. అవగాహన పెంచేందుకు పరిశోధక వాలంటీర్లనీ తయారుచేసింది. ఈ పథకానికి ‘వానవిల్‌ మండ్రం (ఇంద్రధనస్సు ఫోరం)’ అని పేరుపెట్టారు. తాజాగా ఇది అమల్లోకి వచ్చింది.

విద్యార్థుల్లో పరిశోధనాశక్తి పెంచడంతో పాటు, ఆ దిశగా ఆలోచనలు, ఆసక్తి పెరిగేలా ‘వనవిల్‌ మండ్రం’ పథకాన్ని డిజైన్‌ చేశారు. పాఠ్యపుస్తకాల్లోని అంశాల్ని బట్టి ఏయే పాఠశాలల్లో ఎలాంటి ప్రయోగాల్ని విద్యార్థులతో చేయించాలనేదానిపై ప్రతీనెలా షెడ్యూలు వేసేలా అక్కడి పాఠశాల యజమాన్యాలకూ శిక్షణ ఇచ్చారు.

బడికే వస్తారు..

మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో వివిధ రకాల పరికరాలతో ప్రయోగాలు చేయించేందుకు 100 మొబైల్‌ స్టెమ్‌ ల్యాబొరేటరీలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ప్రారంభించారు. ద్విచక్రవాహనాలపై వీటిని ఆయా పాఠశాలలకు తీసుకెళ్లే బాధ్యతను పరిశోధక వాలంటీర్లకు అప్పగించారు. వీరు షెడ్యూలు ప్రకారం పిల్లలతో సైన్స్‌, గణితం, ఇంజినీరింగ్‌ నేపథ్య ప్రయోగాలు చేయిస్తారు.

ఉపాధ్యాయులకూ శిక్షణ

మొబైల్‌ ల్యాబొరేటరీలకు అదనంగా మరో 710 మంది పరిశోధక వాలంటీర్లను (స్టెమ్‌ ఫెసిలిటేటర్లు)ను తమిళనాడు విద్యాశాఖ తయారుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను వివిధ బ్లాకులుగా వేరుచేసి.. ఏ బ్లాక్‌ పరిధిలో ఏ వాలంటీరు వెళ్లి విద్యార్థులతో ప్రయోగాలు చేయించాలనేది షెడ్యూలు చేస్తారు. విద్యార్థుల కోసం స్థానికంగా పాఠశాలల్లోనే ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నారు. వాలంటీర్లకు సహాయంగా పిల్లలకు సహకరించడానికి ప్రతీ పాఠశాలలో ఎంపికచేసిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మంది ఉపాధ్యాయుల్ని సిద్ధం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13210 పాఠశాలల్లోని 25 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల కోసం రూ.25 కోట్లు కేటాయించింది.

ఐఐటీఎంతో కలిసి ముందుకు...

ఈ పథకం ప్రారంభించడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం.. చెన్నైలోని ఐఐటీ మద్రాస్‌తో కలిసి స్టెమ్‌ విధానంపై పలు కార్యక్రమాలు నిర్వహించింది. ప్రత్యేక వేసవి శిబిరాలు ఏర్పాటుచేసి.. 70 శాతం ప్రయోగాలు, 30 శాతం తరగతి పాఠాలతో విద్యార్థుల్లో మార్పుల్ని గమనించారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు తాము గమనించామని ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ వి.కామకోటి తెలిపారు. తాజాగా తెచ్చిన పథకం ద్వారా పేద విద్యార్థుల్లో సరికొత్త పరిశోధక పరిజ్ఞానాన్ని చూస్తామని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఎలా జరుగుతోంది? విద్యార్థుల్లో ఎలాంటి మార్పులొస్తున్నాయనేదానిపై పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని