logo

కృష్ణాపురంలో వ్యక్తి హత్య

విశాఖలో ఓ వ్యక్తి హత్య జరిగింది. అయితే ఈ సంఘటనలో వైకాపా సానుభూతిపరురాలి భర్త ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published : 14 Apr 2024 04:04 IST

వైకాపా సానుభూతిపరురాలి భర్త ప్రమేయంపై దర్యాప్తు

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : విశాఖలో ఓ వ్యక్తి హత్య జరిగింది. అయితే ఈ సంఘటనలో వైకాపా సానుభూతిపరురాలి భర్త ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆరిలోవ సీఐ గోవిందరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఆరిలోవకాలనీ పాండురంగాపురానికి చెందిన దన్యాల అమర్‌ (35) శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతని భార్య చిన్ని రాత్రి 10 గంటలకు ఫోన్‌ చేయగా అరగంటలో వచ్చేస్తానన్నాడు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యింది. ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం భార్య చిన్ని ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణాపురంలో ఓ వ్యక్తి హత్యకుగురై ఉన్నాడన్న సమాచారం రావటంతో పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించగా.. అది దన్యాల అమర్‌దిగా గుర్తించారు. అమర్‌కు తొలిభార్య భీమిలిలో ఉన్నది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా రెండో భార్య చిన్ని ఆరిలోవకాలనీలో ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. అయితే ఇటీవల పెందుర్తికి చెందిన ఓ మహిళా వైకాపా సానుభూతిపరురాలితో  అమర్‌కు పరిచయం ఏర్పడగా.. ఆమె భర్తతో అమర్‌కు కొంతకాలంగా వివాదాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘర్షణల ఫలితంగానే హత్య జరిగిందా లేదా వేరే కోణమా అని ఆరిలోవ పోలీసులు పరిశీలిస్తున్నారు. అమర్‌ ఇటీవలే కొత్త బుల్లెట్‌ కొనుక్కోగా ఆ బుల్లెట్‌ కృష్ణాపురంలో ఉన్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని