logo

మరో బాదుడుకు సిద్ధం

రాష్ట్రంలో జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చినప్పట్నుంచి నగరవాసులపై భారాలు మోపుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర ఆర్థిక సంఘం ఆదేశాల మేరకు విశాఖలో ఆస్తి పన్ను చెల్లించేవారిపై 5శాతం అంటే రూ.20కోట్ల మేర అదనపు భారాన్ని మోపడానికి రంగం సిద్ధమైంది.

Updated : 13 Feb 2024 07:58 IST

5శాతం ఆస్తిపన్ను పెంపునకు జగన్‌ సర్కారు సన్నాహాలు
నగరవాసులపై అదనంగా రూ.50కోట్ల భారం

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : రాష్ట్రంలో జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చినప్పట్నుంచి నగరవాసులపై భారాలు మోపుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర ఆర్థిక సంఘం ఆదేశాల మేరకు విశాఖలో ఆస్తి పన్ను చెల్లించేవారిపై 5శాతం అంటే రూ.20కోట్ల మేర అదనపు భారాన్ని మోపడానికి రంగం సిద్ధమైంది. దీన్ని నగరంలోని నివాసిత సంక్షేమ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆస్తి పన్ను రూపంలో సమకూరిన నిధుల్లో కనీసం 20 శాతం కూడా నగరంలో అభివృద్ధికి వెచ్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లించుకోవడం దారుణమని మండిపడుతున్నారు. మరో వైపు బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్‌ ఛార్జీలు వసూలు చేయడానికి ఆర్థిక సంఘం సిఫారసు చేయడంతో.. ఇకపై ఎక్కడికక్కడ పార్కింగ్‌ ప్రాంతాలను జీవీఎంసీ ఎంపిక చేసి వాహన చోదకుల నుంచి ఛార్జీలు వసూలు చేయనుంది.

ఏటా అదనంగా పిండుకుంటున్నారు: జీవీఎంసీ పరిధిలో 5,53,432 అసెస్‌మెంట్లు ఉండగా, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను దాదాపు రూ.430 కోట్లు వస్తుందని అధికారులు లెక్క కట్టారు. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రతి అసెస్‌మెంట్‌పైనా మరో 5శాతం పన్ను పెంచితే రూ.20కోట్లు పెరిగి ఆదాయం రూ.450 కోట్లకు చేరుతుంది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ.480కోట్లకు చేరుతుంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వార్షిక అద్దె విలువ ఆధారిత ఆస్తి పన్ను నుంచి మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. మార్కెట్ లో భూమి విలువ, భవనం విలువలో 0.13 శాతాన్ని ఆస్తి పన్నుగా నిర్ణయించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో భారమంతా ఒకేసారి పడకుండా ఏటా 15శాతం పెంచుకునేలా ప్రతిపాదించారు.


అద్దెల మోత

కొత్త ఆస్తి పన్ను విధానం అమల్లోకి వచ్చిన తరువాత నగరంలో ఇళ్ల యజమానులు అద్దెలను పెంచేశారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో 15 నుంచి 25 శాతం మేర అద్దెలు పెరిగినట్లు నివాసిత సంక్షేమ సంఘాలు చెబుతున్నాయి. ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలపై భారీగా భారం పడుతోంది. మరో పక్క చెత్త ఛార్జీల పేరుతో ఏటా మురికివాడల నివాసితుల నుంచి రూ.720, మిగతా ప్రాంతాల్లో రూ.1,440 వసూలు చేస్తుండడంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా మరిన్ని భారాలు వేయడానికి సిద్ధం కావడంపై నగరవాసులు మండిపడుతున్నారు.


మధ్య తరగతిపైనే..

-బీబీ గణేష్‌, విశాఖ అపార్టుమెంట్స్‌, రెసిడెంట్స్‌, వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

నగరంలో ఆస్తి పన్ను భారం అత్యధికంగా మధ్యతరగతిపై ఉంది. వారిపై భారం మోపినా ఎలాంటి ప్రతిఘటన ఉండదనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పట్టణాల్లో నూతన ఆస్తి పన్ను విధానం అమలు, తాజాగా 5శాతం పెంపు ప్రతిపాదనలపై చర్చ మొదలైంది. భవిష్యత్తులో ప్రభుత్వంపై దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అడిగేవారు లేరని ఇష్టానుసారంగా ఆస్తి పన్ను పెంచడం, చెత్త ఛార్జీలు వసూలు చేయడం ఏ ప్రభుత్వానికి మంచిదికాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని