logo

బటన్‌ నొక్కి జగన్‌ను ఇంటికి పంపుదాం

వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలో బటన్‌ నొక్కి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని ఇంటికి పంపాలని కూటమి అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేశ్‌ కోరారు. పేటలో మంగళవారం తెదేపా, జనసేన, భాజపా నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Updated : 03 Apr 2024 04:23 IST

సీఎం రమేశ్‌

సీఎం రమేశ్‌, అనితను గజమాలతో సత్కరిస్తున్న నాయకులు

పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలో బటన్‌ నొక్కి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని ఇంటికి పంపాలని కూటమి అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేశ్‌ కోరారు. పేటలో మంగళవారం తెదేపా, జనసేన, భాజపా నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భారీఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యంగా మారిందన్నారు. వైకాపా నుంచి ఎన్నికైన సభ్యులు ఏ రోజూ రాష్ట్ర ప్రయోజనాల గురించి పార్లమెంట్‌లో మాట్లాడలేదని విమర్శించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రయోజనం కోసమే ప్రధాని మోదీని కలిసేవార[ని ఆరోపించారు. ‘నా ఎస్సీ, నా బీసీ అంటూనే వారిపై వేధింపులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై గళం విప్పినందుకు దళిత మహిళని చూడకుండా అనితపై 23 కేసులు పెట్టారని గుర్తుచేశారు. తాను గెలిచాక అనకాపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఎక్కడాలేనివిధంగా యువ ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు, వారి ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లాలోని చక్కెర కర్మాగారాల ఆధునికీకరిస్తామని, లాభాలు ఆర్జించే దిశగా వాటిని తీర్చిదిద్దుతామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా కనుమరుగువుతుందని వివరించారు. తెలంగాణాలో కేసీఆర్‌కు పట్టిన గతే జగన్‌కు పడుతుందని రమేశ్‌ చెప్పారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెదేపా జిల్లా పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు, జనసేన ఇన్‌ఛార్జి గెడ్డం బుజ్జి, భాజపా జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు, నాయకులు పెదిరెడ్డి చిట్టిబాబు, దేవవరపు రఘు తదితరులు పాల్గొన్నారు.

  • ఎస్‌.రాయవరం తెదేపా, జనసేన, భాజపా నాయకులు సీఎం రమేశ్‌కు అడ్డురోడ్డులో స్వాగతం పలికి భారీ గజమాలతో సత్కరించారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో అడ్డురోడ్డు జాతీయ రహదారి ప్రధాన కూడలి వద్ద కూటమి శ్రేణులంతా స్వాగతం పలికారు. మాజీ ఎంపీపీ వినోద్‌రాజు, మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, మాజీ అధ్యక్షులు నల్లపరాజు వెంకటరాజు తదితరులు ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని