logo

ఎప్‌సెట్‌లో ర్యాంకు రాలేదా.. ఏం ఏం ఫర్వాలేదు..!

ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు రాలేదని.. అర్హత సాధించలేదని ఆందోళన చెందుతున్నారా.. విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వీరి కోసం ఎన్నో కోర్సులు ఎదురు చూస్తున్నాయి.

Published : 23 May 2024 07:40 IST

విద్యార్థులకు ప్రత్యామ్నాయ అవకాశాలెన్నో..!
ఇంటర్‌తో ఉద్యోగాలు సైతం..

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి, కాజీపేట, న్యూస్‌టుడే: ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు రాలేదని.. అర్హత సాధించలేదని ఆందోళన చెందుతున్నారా.. విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వీరి కోసం ఎన్నో కోర్సులు ఎదురు చూస్తున్నాయి. ఇటీవల వెలువడిన ఎప్‌సెట్‌ 2024 ఫలితాల్లో గతంతో పోలిస్తే చాలా తక్కువ మంది అర్హత సాధించారు. వీరి సంఖ్య 30 శాతానికిపైగా ఉంటుంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తర్వాత ఏమిటి అనే ఆందోళనలో ఉన్నారు. 

సంప్రదాయ కోర్సులు అనేకం.. 

ఇంజినీరింగ్‌కు సమాన అవకాశాలు ప్రస్తుతం ఎన్నో ఉన్నాయి. డిగ్రీ కళాశాలల్లోనూ ఇప్పుడు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు వస్తున్నాయి. బీఎస్సీ, బీకాంలే కాకుండా ప్రస్తుతం అవసరమైన ఆధునిక కోర్సులు కంప్యూటర్‌ సైన్స్‌ లాంటివి జతచేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌తో సంబంధం లేకుండా కోచింగ్‌ సెంటర్లలో పైథాన్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనాలసిస్‌ తదితర కోర్సులు నేర్చుకుని నేరుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది.

  • డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) కోర్సు చేయొచ్చు. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, జియాలజీ లాంటి కాంబినేషన్లు చదవొచ్చు. బీఎస్సీలో డేటా సైన్స్, బీబీఏ, బీకాం, జర్నలిజం, టూరిజం లాంటి కోర్సులనూ ఎంచుకోవచ్చు. న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీలో చేరవచ్చు. సివిల్‌ సర్వీసెస్‌కు ఏ డిగ్రీ చదివినా అర్హులే. ఇవేకాక చరిత్ర, తెలుగు సాహిత్యం, ఆంగ్లం, సోషియాలజీ, జాగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ తదితర కోర్సుల్లోనూ చేరవచ్చు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్, బ్యాంకింగ్‌లో కూడా ఏదేని డిగ్రీ అర్హతతో పోటీ పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 


ఇంటి గ్రేటెడ్‌ కోర్సులు.. 

ప్రస్తుతం వరంగల్‌ లాంటి నగరాల్లోనూ అనేక కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు వస్తున్నాయి. వీటిలో విషయ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రసాయన, భౌతిక శాస్త్రం, గణిత అధ్యాపకులకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఎప్‌సెట్‌లో ర్యాంకులు సాధించని విద్యార్థులు ఇంటిగ్రెటెడ్‌ కోర్సుల్లో చేరవచ్చు. ఇది ఐదు సంవత్సరాల కోర్సుగా ఉంటుంది. నేరుగా మాస్టర్‌ డిగ్రీ పొందడానికి అవకాశం ఉంటుంది. కళాశాలల్లో లెక్చరర్లుగా లేదా ల్యాబ్‌లలో ఉద్యోగాలు సంపాదించవచ్చు. విదేశాలల్లో కూడా అధ్యాపకులుగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.


నర్సింగ్‌లో అనేక  మార్గాలు..

ఎప్‌సెట్‌లో అనుకున్నంత ర్యాంకులు సాధించని వారు నర్సింగ్, ఫార్మసీ, పిజియోథెరఫీ, అనెస్థీషియా లాంటి కోర్సులను ప్రైవేటుగా చదువుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల మేనేజ్‌మెంట్‌ కోటాలో పొందవచ్చు. 


చదువు.. కొలువు..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) పరీక్షను ఇంటర్‌ అన్ని గ్రూపుల వారు రాసుకోవచ్చు. ఈ పరీక్షలో ఎంపికైన వారికి బీఏ, బీఎస్సీ, బీటెక్‌ కోర్సులను చదివిస్తారు. శిక్షణ అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో తీసుకుంటారు.


‘గతంలో పరిమిత కోర్సులే ఉండేవి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు నూతన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ర్యాంకు రాలేదని అధైర్య పడక ముందుకు సాగాలి. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. సమాన అవకాశాలున్నప్పుడు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించొచ్చు’.


బీఎస్సీ, బీబీఏ, బీకాం, జర్నలిజం, టూరిజం , ఎల్‌ఎల్‌బీ 


ప్రవేశ పరీక్షలతోనూ..

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్డీ, కోస్టుగార్డు, పోస్టల్, రైల్వేస్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ రంగాల్లో  ఉద్యోగావకాశాలు ఉంటాయి. కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్‌ లోకోపైలట్, జూనియర్‌ క్లర్క్, టికెట్‌ క్లర్క్, డివిజనల్‌ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వంటి ఉద్యోగాలకు అర్హులే. వాటికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పోలీస్, అటవీ, ఎక్సైజ్‌ శాఖల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. పరీక్ష, ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 


డిగ్రీతోనూ ఉంటాయి..
- శ్యామ్‌ ప్రసాద్, ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భూపాలపల్లి

ఇంటర్‌ పాసై ఎప్‌సెట్‌లో మంచి ర్యాంకు రాని వారు, అర్హత సాధించని వారికి డిగ్రీలో మంచి అవకాశాలున్నాయి. బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్, బీఎస్సీ బీజడ్‌సీ, బీకాం, బీఏ కోర్సుల్లో చేరవచ్చు. వీటిలో కంప్యూటర్స్‌ కూడా సబ్జెక్ట్‌గా ఎంచుకోవచ్చు. బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చేసే వాళ్లకే కాకుండా డిగ్రీలో కంప్యూటర్స్‌ కోర్సులు చేసిన వారికి కూడా సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలుంటున్నాయి. కొన్ని డిగ్రీ కళాశాల్లో డేటా సైన్స్, బీబీఎం, బీసీఏ లాంటి కోర్సులు కూడా ఉంటున్నాయి. బీటెక్‌ నాలుగు సంవత్సరాలు ఉంటుంది, డిగ్రీ మూడేళ్లే. ఒక సంవత్సరం సమయం ఆదా అవుతుంది. డిగ్రీ తర్వాత ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి.


అధైర్యపడాల్సిన అవసరం లేదు 
- దబ్బెట మహేష్, స్టూడెంట్‌ కౌన్సెలర్‌

ర్యాంకు రాలేదని అధైర్య పడాల్సిన అవసరం లేదు. మరోసారి ప్రయత్నం చేయవచ్చు లేదా సంవత్సరం కోల్పోవడం ఇష్టం లేని వారు అనేక ఇతర కోర్సుల్లోకి వెల్లడానికి అవకాశం ఉంది.   మీరు చదువుకున్న కళాశాల అధ్యాపకుల సూచనలు పాటించి వారి సలహాతో మంచి మార్గం ఎంచుకోవాలి. ఏ రంగమైనా స్కిల్‌ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగడానికి అవకాశం ఉంది. ఎప్‌సెట్‌ ప్రవేశ పరీక్ష రాసి అనుకున్న ఫలితం రాని వారు ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంది. బీకాం కంప్యూటర్స్, బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్, బీబీఎం, బీబీఏ లు పూర్తి చేసి మార్కెట్‌ రంగంలోకి వెళ్లడానికి అవకాశం ఉంది. ఈ కోర్సుల్లోనే హాస్పిటాలిటీ, టూరిజంతోపాటు ఇంకా అనేక అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని