logo

అసంపూర్తి పనులు.. విద్యార్థులకు వెతలు

రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.

Published : 25 May 2024 03:45 IST

ములుగు న్యూస్‌టుడే: ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. దీంతో ఏడాదిగా పనులు అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయి. గతేడాది మే చివరి నాటికి పూర్తి చేయాలని గడువు విధించినప్పటికీ.. గుత్తేదారులు, పాఠశాలల యాజమాన్య కమిటీలకు బిల్లులు రాకపోవడంతో.. పనులను మధ్యలోనే నిలిపివేశారు. రూ.30 లక్షల లోపున్న పనులను పాఠశాల యాజమాన్య కమిటీలకు, ఆపైనున్నవి గుత్తేదార్లకు టెండరు ద్వారా అప్పగించారు. ములుగు జిల్లాలో ఈ పథకం పనులు, ప్రస్తుత పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ బృందం శుక్రవారం పరిశీలన చేసింది.

 జిల్లా పరిధిలోని 125 పాఠశాలల్లో మొత్తం 2,839 పనులు చేపట్టగా, రూ.21.79 కోట్లు బిల్లులు చేశారు. ఇందులో 2,407 పనులకు రూ.18.60 కోట్లు చెల్లించగా, రూ.3.19 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, ఈడబ్ల్యూ ఐడీసీ ఇంజినీరింగ్‌ విభాగాలు పనులను పర్యవేక్షిస్తున్నాయి.

పూర్తికాని టాయిలెట్‌ బ్లాక్‌ 

ఎంపికైన పాఠశాల పేరు: జడ్పీ ఉన్నత పాఠశాల, ఎంపీపీఎస్, దుంపెల్లిగూడెం
నిధుల కేటాయింపు: రూ.80 లక్షలు
చేపట్టాల్సిన పనులు: వంటశాలలు, టాయిలెట్లు నిర్మాణం
ప్రస్తుతం పనుల ఏదశలో ఉన్నాయి: టాయిలెట్‌ బ్లాక్‌ అసంపూర్తిగా మిగిలింది.
ఇతర నిధులు కేటాయించే అవకాశం ఉందా?: లేదు.
ఇతర అంశాలు: చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు. బిల్లులు చెల్లిస్తే అసంపూర్తి పనులు చేసే అవకాశం ఉంది.

 న్యూస్‌టుడే, గోవిందరావుపేట

కిటికీ తలుపులు లేకుండా

  • తిమ్మంపేట ప్రాథమిక పాఠశాల 
  • సుమారు రూ.21 లక్షలు
  • కిటికీలకు తలుపులు, విద్యుత్తు, ప్రహరీ, గేటు, తాగునీరు, బోరు నిర్మాణం
  • లేదు
  • భవనం మాత్రమే పూర్తయింది. కిటికీలకు తలుపులు లేవు. విద్యుత్తు పనులు నాసిరకం. మిగతావన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.  ః ఉన్నతాధికారులు పరిశీలించి పెండింగ్‌ పనులు పూర్తయ్యేలా చూడాలి.

మంగపేట, న్యూస్‌టుడే

కలెక్టర్‌ పరిశీలించినా..

  • జడ్పీ ఉన్నత పాఠశాల, వెంకటాపురం
  • రూ.1.70 కోట్లు 
  • ఎనిమిది గదులతో భవన నిర్మాణం, డైనింగ్‌ హాల్, సంప్, పూర్వపు భవనాల ఆధునికీకరణ, ప్రహరీ నిర్మాణం
  • లేదు. 
  • భవన నిర్మాణం అసంపూర్తిగా ఉంది. డైనింగ్‌ హాల్, సంపు, నల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆగింది. ప్రహరీ మొదలు కాలేదు. 
  • గత నెల 15న జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌ పాఠశాలను సందర్శించి గుత్తేదారు, ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌ బిల్లులు రూ.43 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా.. పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.

 న్యూస్‌టుడే, వెంకటాపురం

రంగులు వేయకుండా

  • నర్సింగాపురం ప్రాథమిక పాఠశాల
  • రూ.3.70 లక్షలు
  • స్లాబుకు మరమ్మతులు, పగుళ్లను సిమెంటుతో పూడ్చడం, వంటశాలకు మరమ్మతులు, బోరుకు కొత్తమోటారు బిగించడం, విద్యుత్తు, రంగులు వేయడం
  • లేదు
  • స్లాబు మరమ్మతులు చేశారు. బోరుకు మోటారు బిగించారు. పగుళ్లకు మరమ్మతులు చేయాలి. రేకులు అమర్చాలి. రంగులు వేయాల్సి ఉంది.
  • అధికారులు చొరవచూపితేనే విద్యార్థులకు మేలు.

 న్యూస్‌టుడే, తాడ్వాయి

నిలిచిపోయిన వంటగది

  • మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల, జగన్నాథపురం
  • రూ.37.90 లక్షలు 
  • వంటగది, భోజనశాల, బాలబాలికలకు మరుగుదొడ్లు, నల్లాలు, తాగునీరు, విద్యుత్తు
  •  పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. 
  • లేదు
  • ఉన్నతాధికారులతో సమీక్షించి పెండింగ్‌ పనులు చేపట్టాలి.

న్యూస్‌టుడే, వాజేడు

అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పనులు

‘మన ఊరు మన బడి’ కింద పెండింగ్‌లో ఉన్న చిన్న పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేయాలని సూచించాం. విద్యుత్తు, టాయిలెట్లు, తాగునీరు, రంగులు వేయడం, తదితర పనులు చేపట్టి పూర్తిచేస్తారు. పెద్ద పనుల (అదనపు తరగతి గదులు, తదితర)కు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం. పాఠశాలల్లో చేపట్టిన పనులను పరిశీలిస్తున్నాం.

 జి.పాణిని, డీఈవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని