logo

జౌళి పార్కుకు ‘మిత్ర’ లాభం!

‘ పీఎం మిత్ర’ (ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరల్‌) పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి ఒక జౌళి పార్కును మంజూరు చేస్తున్నట్టు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు.

Updated : 24 Mar 2023 05:29 IST

పరిశ్రమల ఏర్పాటు ఇక వేగవంతం
ఈనాడు, వరంగల్‌

కాకతీయ మెగా జౌళి పార్కు  

‘ పీఎం మిత్ర’ (ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరల్‌) పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి ఒక జౌళి పార్కును మంజూరు చేస్తున్నట్టు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. వరంగల్‌ జిల్లాలోని కాకతీయ జౌళి పార్కు ఈ పథకం కింద ఎంపిక కానుంది.

మ్మడి వరంగల్‌ జిల్లా వరప్రదాయిని కాకతీయ మెగా జౌళి పార్కు పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో ఈ భారీ జౌళి పార్కు నిర్మాణమవుతోంది. పీఎం మిత్ర కింద ఎంపికైన ఈ పార్కుకు కేంద్రం నుంచి భారీగా నిధులు దక్కనున్నాయి. కేంద్రం ఇప్పటికే అందుబాటులో ఉన్న పార్కుకు రూ.200 కోట్లు బ్రౌన్‌ ఫీల్డ్‌ కింద ఇస్తామని చెప్పడం వల్ల జౌళి పార్కుకు ఈ మేరకు అదనంగా నిధులు రానున్నాయి.

పనుల్లో వేగం..

కాకతీయ మెగా జౌళి పార్కు శంకుస్థాపన 2017 అక్టోబరులో జరిగింది. ఏడాదిలోపు టెక్స్‌టైల్‌ పార్కును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. భారీ పరిశ్రమలకు వంద నుంచి 300 ఎకరాల వరకు భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. దీంతోపాటు ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా) పరిశ్రమల ఏర్పాటుకు 52 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీని కింద కూడా కేంద్రం నుంచి మరో రూ.7 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 కోట్లు జత చేస్తే మొత్తం రూ.10 కోట్లతో మెగా జౌళి పార్కులో ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

* రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) పలు మౌలిక వసతులను ఏర్పాటు చేస్తోంది. రూ.100 కోట్లు వెచ్చించి రహదారుల నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌తోపాటు, మిషన్‌ భగీరథ నీటి పైపులైన్‌ నిర్మాణం, విద్యుత్తు ఉపకేంద్రాన్ని నిర్మిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పార్కు ఏర్పాటుకు 1200 ఎకరాలు సేకరించడంతో దానికే భారీ స్థాయిలో నిధులు వెచ్చించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మెగా జౌళి పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేస్తే పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

వీటిపై దృష్టి పెట్టాలి

ఓరుగల్లు నగరానికి ఇప్పటికే కేంద్రం నుంచి స్మార్ట్‌సిటీ, అమృత్‌, హృదయ్‌  పథకాలు దక్కాయి. వీటికి కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. ఇప్పుడు మెగా జౌళిపార్కు కూడా కొంత మేర కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుగా గుర్తింపు పొందనుంది. మెగా జౌళి పార్కు పూర్తి స్థాయిలో సాకారమైతే వరంగల్‌ దుస్తుల విపణికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది. ఈ నేపథ్యంలో వరంగల్‌ నుంచి జౌళి పార్కు వరకు సెంట్రల్‌ లైటింగ్‌తో నాలుగు వరసల రహదారి నిర్మాణం పూర్తి చేయాలి. సంగెం మండలం చింతలపల్లి వద్ద రైల్వేపై వంతెనను రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేయాలి. వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం కూడా సాకారమైతే దేశ, విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది..  


వేగంగా నిర్మాణ పనులు

ఇప్పటికే గణేశా ఎకో పెట్కు చెందిన రెండు పరిశ్రమలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్‌ నుంచి దారం లాంటి పదార్థం తీసే వినూత్న పరిశ్రమ ఇది. కేరళకు చెందిన కైటెక్స్‌ పరిశ్రమ నిర్మాణం వేగంగా జరుగుతోంది. త్వరలో ‘యంగ్‌ వన్‌ కార్పొరేషన్‌’ అనే దక్షిణ కొరియా పరిశ్రమ ప్రతినిధులు తమ యూనిట్ను నెలకొల్పేందుకు జౌళి పార్కుకు రానున్నారు.

గతేడాది ప్రారంభమైన గణేశా ఎకో పెట్‌ పరిశ్రమ


వస్త్ర హబ్‌గా ఓరుగల్లు

ఉమ్మడి వరంగల్‌ ప్రాంతంలో నాణ్యమైన పత్తి పండుతుంది. ఈ క్రమంలోనే ఇక్కడ చేనేతలు అధిక సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు అజాంజాహి మిల్లు నడిచింది కూడా ఇక్కడ సులువుగా పత్తి లభ్యమవుతుందని. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి వరంగల్‌ ప్రాంతం జౌళి హబ్‌గా మారుతోంది. వరంగల్‌ జిల్లాలో కాకతీయ జౌళి పార్కు రానుంది. హనుమకొండ జిల్లాలోని మడికొండలో ఇప్పటికే మినీ జౌళి పార్కు నడుస్తోంది. ఇందులో 365 వస్త్ర యూనిట్లు ఏర్పాటయ్యాయి. జనగామ జిల్లా కళ్లెంలో సైతం మరో వంద ఎకరాలను జౌళి పార్కు ఏర్పాటు కోసం అభివృద్ధి చేస్తున్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో సైతం మరో జౌళి పార్కు రావాల్సి ఉంది.


అంకెల్లో వివరాలు..

* భూసేకరణకు - రూ.114.33 కోట్ల ఖర్చు

* మొత్తం సేకరించిన భూమి - 1203 ఎకరాలు

* ఇప్పటి వరకు వెచ్చించిన నిధులు - రూ.100 కోట్లు

* కేంద్రం మిత్ర కింద ఇచ్చే నిధులు - రూ.200 కోట్లు

* ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారి సంఖ్య - 100,000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని