logo

తెదేపా మైనార్టీ సెల్‌ నాయకుల నిర్బంధం

నరసాపురంలో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభకు వెళ్లిన యువతులు ధరించిన నల్ల చున్నీలు, ముస్లిం మహిళల బురఖాలు తీయించిన ఉదంతాన్ని నిరసిస్తూ అన్ని కలెక్టరేట్‌ కార్యాలయాల్లో సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో వినతులు ఇవ్వాలని తెదేపా ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు నిర్ణయించారు.

Published : 29 Nov 2022 05:47 IST

భీమవరం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట నినాదాలు చేస్తున్న తెదేపా శ్రేణులు

భీమవరం పట్టణం, అర్బన్‌, ఆకివీడు, నరసాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: నరసాపురంలో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభకు వెళ్లిన యువతులు ధరించిన నల్ల చున్నీలు, ముస్లిం మహిళల బురఖాలు తీయించిన ఉదంతాన్ని నిరసిస్తూ అన్ని కలెక్టరేట్‌ కార్యాలయాల్లో సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో వినతులు ఇవ్వాలని తెదేపా ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు నిర్ణయించారు. ఈ విషయం బహిర్గతం కావడంతో జిల్లాకు చెందిన పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనార్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ నౌషాద్‌ను భీమవరం ఒకటోపట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే తెదేపా నాయకులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆకివీడు, తాడేపల్లిగూడెం, భీమవరంలలో మైనార్టీ విభాగం నాయకులు ఎండీ జాకీర్‌, షేక్‌ బాజీ, ఎండీ ఫిరోజ్‌లను అరెస్టు చేయడంపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సంప్రదాయాలపై కూడా పెత్తనం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు.నీ భీమవరంలో కలెక్టరేట్‌ వద్ద వద్ద మైనార్టీ సెల్‌ నాయకులు నసీమాబేగం, సబీనీబేగం, షాబు తదితరులు నిరసన చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే:  భీమవరం కలెక్టరేట్‌కు బయలుదేరిన తెదేపా మైనార్టీ విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ నరసాపురం పట్టణ స్టేషన్‌కు తరలించినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. పట్టణ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండీ మౌలాలీ ఖాన్‌, ఎండీ షాజహాన్‌ తదితరులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు