logo

విజయవాడలో వృద్ధురాలి హత్య

విజయవాడ నగరంలో గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో లెనిన్‌ కూడలి పార్కులో బుధవారం తెల్లవారుజామున ఓ వృద్ధురాలు హత్యకు గురైంది.

Published : 23 Feb 2024 02:33 IST

నిందితుడు కడప వాసి

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: విజయవాడ నగరంలో గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో లెనిన్‌ కూడలి పార్కులో బుధవారం తెల్లవారుజామున ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. చిట్టినగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు (74) గత 20 సంవత్సరాలుగా గవర్నర్‌పేటలోనే ఉంటోంది. ఆమెకు ఒక కూతురు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నా పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ రాత్రి వేళ లెనిన్‌కూడలిలోని పార్కులో నిద్రపోతూ ఉంటుంది. కడపకు చెందిన ఆర్ల విజయశంకర్‌ (35) తన భార్య, పిల్లలను వదిలేసి కొద్ది సంవత్సరాలుగా విజయవాడలోనే ఉంటూ అదే పార్కులో పడుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే వృద్ధురాలు మంగళవారం రాత్రి వాకింగ్‌ ట్రాక్‌పై నిద్రపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత విజయశంకర్‌ వచ్చి తాను పడుకునే స్థలంలో నువ్వు పడుకున్నావేంటి? అని ఆమెతో గొడవపడ్డాడు. ఆ గొడవ కాస్త... పెద్దదిగా మారి, వృద్ధురాలి గుండెలపై గట్టిగా గుద్దాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆమెపై గంజాయి బ్యాచ్‌ అత్యాచారం చేసి హత్య చేశారంటూ ఆరోపణలొచ్చాయి. దీనిపై పోలీసులు మాట్లాడుతూ అదంతా అవాస్తమమని, పడుకునే స్థల విషయమై ఏర్పడిన వివాదమే హత్యకు దారి తీసిందని చెప్పారు. నిందితుడు విజయశంకర్‌ను గురువారం సాయంత్రం అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని