logo

మాంజా.. మృత్యు పంజా!

Eenadu icon
By Telangana Dist. Desk Published : 27 Dec 2025 04:22 IST
Ee
Font size
  • A
  • A+
  • A++
2 min read

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ సాంస్కృతికం

డాబాపైకి ఎక్కి పతంగులు ఎగురవేస్తున్న యువకులు

మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.. ఈ పండగ వస్తుందంటే చాలు ఆదిలాబాద్‌ జిల్లాలో హడావుడి అంతా ఇంతా కాదు.. అన్ని వయసులవారు డాబాలు ఎక్కి పోటాపోటీగా గాలి పటాలు ఎగురవేస్తుంటారు. డీజే హోరులో సందడి చేస్తుంటారు. పతంగుల పోటీని ప్రత్యక్ష వ్యాఖ్యానం(కామెంటరీ) చేస్తుంటారు. గాలిలోనే పతంగులను తెంచేయాలని హానికారక రసాయన రంగులతో తయారు చేసిన చైనా దారాన్ని(మాంజా) ఉపయోగిస్తుంటారు. తెగి కింద పడిన ఈ చైనా మాంజాలతో ప్రజల గొంతులకు చుట్టుకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

సంప్రదాయ దారాన్ని వాడాలని అటవీశాఖ అధికారులు, పోలీసులు, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో చైనా మాంజా చుట్టుకొని చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రానున్న పతంగుల పర్వం విషాదం కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చెబుతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో దాడులు

ఈ ఏడాది జనవరిలో నిర్మల్‌ జిల్లాలో ఇద్దరు చైనా మాంజాతో గాయాల బారిన పడటంతో ఆదిలాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి నేతృత్వంలో అనేక గాలిపటాల దుకాణాలపై దాడులు నిర్వహించారు. రూ.50వేల విలువైన చైనీస్‌ మాంజాను స్వాధీనం చేసుకొని దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. ఇంద్రవెల్లి మార్కెట్‌లోని గాలిపటాల దుకాణాలపై అటవీ శాఖ అధికారులు దాడులు చేశారు.

విక్రయిస్తే శిక్ష తప్పదు..

చైనా మాంజా చాలా ప్రమాదకరం. పక్షులకే కాకుండా ప్రజలకు వీటి వల్ల ముప్పే.. ఈ మాంజాను ప్రభుత్వం నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం వీటిని విక్రయించిన వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. మరికొందరు గాజు కోటింగ్‌తో కూడిన నైలాన్, సింథటిక్‌ దారాన్ని వాడుతుంటారు. ఇదీ ప్రమాదకరమే. కంటికి కనిపించకుండా సన్నగా ఉండే దారాలకు పక్షులు చిక్కుకొని చనిపోతున్నాయి. ప్రజలు గాయపడుతున్నారు.

ఈ జాగ్రత్తలు పాటిద్దాం..

1. చైనా మాంజాపై నిషేధం ఉంది. సంప్రదాయ దారాన్ని వినియోగించడమే మంచిది.

2. విద్యుత్తు తీగలు, చెట్లు లేని ప్రదేశాలు చూసుకోవాలి. చెట్లకు, తీగలకు చిక్కిన పతంగులను తీసేందుకు సాహసం చేయొద్దు. తెగిన గాలిపటాలను అందుకోవడానికి ప్రయత్నం చేయొద్దు.

3. క్రీడా మైదానాల్లో గాలిపటాలను ఎగురవేయడం మేలు. ఇంటి డాబా పైన, మేడపైన గాలిపటాలు ఎగురవేసే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

4. పతంగుల పోటీ ఉత్సాహంలో ఉరుకులు, పరుగులు చేయొద్దు. జన సంచారం ఉన్నచోట ఎగురవేయొద్దు.


ఇద్దరికి గాయాలు

ఈ ఏడాది జనవరి 6న నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ పట్టణంలో చంద్రవిలాస్, ఎర్రన్న విద్యానగర్‌ కాలనీ నుంచి బస్టాండ్‌కు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. ప్రధాన రహదారిపై చైనా మాంజా అడ్డు వచ్చింది. చంద్రవిలాస్‌ గొంతుకు మాంజా కోసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన ఎర్రన్న చేతితో మాంజాను అడ్డుకునే ప్రయత్నం చేయగా చేతి వేళ్లకు గాయమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

లైవ్ టీవీ