logo

Ponguleti: గత ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో ‘కాళేశ్వరం’ నివేదిక ద్వారా తెలిసింది: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Telangana Dist. Team Updated : 05 Aug 2025 16:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఖమ్మం: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ద్వారా తెలిసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్‌ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. మంగళవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కల్యాణలక్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేశామన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను కోరారు.

ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడి కోసం అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తిరుమలాయపాలెం మండలానికి ఒక ఐటీఐ కళాశాల మంజూరు చేశామని, ప్రభుత్వ ఆసుపత్రికి ఆధునికీకరణ చేస్తున్నామని వెల్లడించారు. మండల అభివృద్ధికి రూ.75 కోట్లు కేటాయించామన్నారు. పేదవాడి ఆకలి తీర్చే ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేశామని.. పేద రైతుల కోసం భూభారతి తీసుకొచ్చామన్నారు.

బాలికలకు సైకిళ్ల పంపిణీ..

ఏదులాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, 1, 59, 60వ డివిజన్లకు చెందిన 8వ తరగతి బాలికలకు మంత్రి సైకిళ్లు పంపిణీ చేశారు. పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ తరుఫున మంగళవారం సైకిళ్లను పంపిణీ చేశారు. వచ్చే ఏడాది నుంచి స్కూల్ విద్యార్థులతో పాటు జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా సైకిళ్లు ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

Tags :
Published : 05 Aug 2025 15:49 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని