8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 8వ వేతన కమిషన్‌కు ఆమోదం

Eenadu icon
By National News Team Published : 28 Oct 2025 15:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కోటీ పదిహేను లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పింఛనుదారుల.. జీతాలు, పింఛన్లు పెంచేందుకు వీలుగా 8వ వేతన కమిషన్‌కు (8th Pay Commission) కేంద్ర కేబినెట్‌ (Union Cabinet) మంగళవారం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రంజన దేశాయ్‌ ఈ పే కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు.

ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పలువురు కేంద్ర మంత్రులు, మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపింది. అనంతరం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో ఛైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. ఈ సంఘం 18 నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.

వేతన సంఘం అంటే..

దేశంలో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛనుదారుల వేతనాలు, భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న జీతాలు, పింఛన్లను ఎంత మేర పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని