DK Shivakumar: అసెంబ్లీలో డీకే ఆరెస్సెస్‌ గీతాలాపన.. పార్టీ మార్పునకు సంకేతమా?

Eenadu icon
By National News Team Published : 22 Aug 2025 12:49 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెంగళూరు: కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశంపై పార్టీలో అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని ఓవైపు సిద్ధరామయ్య నొక్కి చెబుతున్నా.. అటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌.. తన చేతుల్లో ఏమీ లేదంటూనే ‘ఆశ పడటంలో తప్పులేదు కదా’ అనే సంకేతాలిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా డీకే (DK Shivakumar) వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో శివకుమార్‌ తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ.. ఆరెస్సెస్‌తో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆరెస్సెస్‌ (RSS) గీతమైన ‘నమస్తే సదా వత్సలే’ను ఆయన పాడడంతో భాజపా (BJP) నాయకులంతా చిరునవ్వులు చిందిస్తూ, బల్లలపై చప్పట్లు చరుస్తూ.. నినాదాలు చేశారు. 

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అసెంబ్లీలో శివకుమార్‌ ప్రవర్తనపై నెట్టింట చర్చ మొదలైంది. తనకు సీఎం పీఠం ఇవ్వకపోతే భాజపాలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీని, సిద్ధరామయ్యను బెదిరించేందుకే ఆయన ఈవిధంగా చేసి ఉంటారని పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇటీవల స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాని మోదీ ఆరెస్సెస్‌ను ప్రశంసించడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తప్పుపట్టిన నేపథ్యంలో శివకుమార్‌ పరోక్షంగా ఆయనకు పార్టీ మార్పు గురించి హెచ్చరికలు చేసి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు.

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా ఓ అంగీకారానికి వచ్చారన్న వార్తలూ వచ్చాయి. పలు కేసుల్లో సిద్ధరామయ్య పేరు బయటకు రావడంతో సీఎంగా ఆయనను తొలగించాలన్న డిమాండ్లు తెర పైకి వస్తున్నాయి. అయితే సీఎం మార్పునకు పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో శివకుమార్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తాను కూడా ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని పలుమార్లు బహిరంగంగానే చెప్పిన డీకే.. తన వ్యాఖ్యల ద్వారా ఆ పీఠంపై తనకున్న ఆశను వెలిబుచ్చుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు