Eknath Shinde: సీఎంగా ఫడణవీస్‌.. ఏక్‌నాథ్‌ శిందేకు డిప్యూటీ..!

Eenadu icon
By National News Team Updated : 03 Dec 2024 15:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లే కన్పిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) రాష్ట్ర పగ్గాలు అందుకోవడం ఖాయమైనట్లు సమాచారం. ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

డిసెంబరు 5న మహారాష్ట్ర (Maharashtra) కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని, శిందేతో పాటు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar) కూడా ఆ రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలిపాయి. బుధవారం భాజపా శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.

విపక్ష కూటమిలో చీలికలు? పార్లమెంట్‌లో ఆందోళనలకు ఆ రెండు పార్టీలు దూరం

సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి (Mahayuti) కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి పదవి తనకు వద్దని, హోంశాఖను కేటాయించాలని శిందే పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పరిస్థితులను పర్యవేక్షించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీలను పరిశీలకులుగా భాజపా అధిష్ఠానం నియమించింది. మరోవైపు, ఎన్డీయే నేత రామ్‌దాస్‌ అథవాలే తాజాగా ఏక్‌నాథ్‌ శిందేతో చర్చలు జరిపినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించాలని ఆయనకు నచ్చజెప్పినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఇందుకు శిందే కూడా సుముఖత వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.

మెరుగుపడని శిందే ఆరోగ్యం..

మరోవైపు ఏక్‌నాథ్‌ శిందే కొన్ని రోజులుగా జ్వరం, గొంతునొప్పితో ఇబ్బందిపడుతున్నారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మంగళవారం ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు శిందే సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఠాణెలోని ఓ ఆసుపత్రిలో ఆయన చెకప్‌ చేయించుకున్నారు. ఆయనకు పలు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్లు సదరు వర్గాలు తెలిపాయి.

Tags :
Published : 03 Dec 2024 14:16 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు