Google Maps Team: గూగుల్‌ మ్యాప్స్‌ బృందాన్ని దొంగలనుకొని దాడి చేసి..!

Eenadu icon
By National News Team Published : 30 Aug 2025 00:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కాన్పూర్‌: సర్వే నిర్వహించేందుకు వెళ్లిన గూగుల్‌ మ్యాప్స్‌ (Google Maps) బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ఫొటోలు తీస్తున్న వారిని దొంగలుగా భావించిన గ్రామస్థులు వారిపై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని (UttarPradesh) కాన్పూర్‌లో చోటు చేసుకుంది. టెక్‌ మహీంద్రా సంస్థకు చెందిన బృందం ఓ వాహనంపై కెమెరాలు అమర్చి.. స్థానిక గ్రామంలోని వీధుల్లో సర్వే (Survey) నిర్వహిస్తోంది. అది చూసిన గ్రామస్థులు.. వారిని దొంగలుగా భావించారు. దొంగతనం చేసేందుకు వీలుగా.. వాహనానికి కెమెరాలు అమర్చి సమాచారాన్ని సేకరిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

నిమిషాల వ్యవధిలోనే గ్రామస్థులంతా ఏకమై ఆ బృందాన్ని చుట్టుముట్టారు. వాహనాన్ని అడ్డుకొని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వచ్చి సర్ది చెప్పేలోగా వారిపై గ్రామస్థులు దాడి చేశారు. అనంతరం సర్వే బృందాన్ని, కొందరు గ్రామస్థులను పోలీసులు స్థానిక పోలీస్టేషన్‌కు తరలించారు. తాము దొంగలం కాదని చెబుతున్నా వినకుండా తమపై దాడి చేసినట్లు సర్వే బృందం ఫిర్యాదు చేసింది. ఆ గ్రామాన్ని సర్వే చేసేందుకు వెళ్లామని, అందుకు డీజీపీ నుంచి అనుమతి కూడా తీసుకున్నామని గూగుల్‌ మ్యాప్స్‌ బృందంలోని సభ్యుడొకరు మీడియాకు వివరించారు. 

ఇటీవల కాలంలో ఆ గ్రామంలో పెద్ద సంఖ్యలో దొంగతనాలు జరిగాయి. దీంతో గ్రామస్థులు కొంత భయాందోళనలకు గురయ్యారు. అదే సమయంలో వాహనానికి కెమెరాలు అమర్చి, వీధుల్లో తిరుగుతుంటే వారిని దొంగలుగా భావించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు