Piyush Goyal: భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి: పీయూష్‌ గోయల్‌

Eenadu icon
By National News Team Published : 02 Jun 2025 12:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనపై అగ్రరాజ్యానికి, భారత్‌కు (India-US) మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) పేర్కొన్నారు. ఈ ఒప్పందం విషయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చల్లో పాల్గొన్న సమయంలోనూ మాట్లాడుకున్నారన్నారు. వాణిజ్యం విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలనే భావనతో ఉన్నాయన్నారు. ఈ సమస్యను ఇరుదేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటాయని వెల్లడించారు. 

ఇరుదేశాల మధ్య ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఈ వారం భారత్‌ను సందర్శించనుందని గోయల్‌ తెలిపారు. జూన్ చివరికి ఇరుదేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరే అవకాశం ఉందన్నారు. ఈవిషయంపై భారత వాణిజ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గత నెలలో వాషింగ్టన్‌లో అధికారులతో ప్రతిపాదిత ఒప్పందంపై చర్చలు జరిపారని గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో అధికారిక పర్యటనలో ఉన్న గోయల్‌ ఆ దేశంతో వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంచుకోవడానికి అక్కడి నాయకులు, వ్యాపార ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.

ప్రస్తుతం భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియంపై ఉన్న 25 శాతం సుంకాలను జూన్ 4 నుంచి రెట్టింపు చేస్తామని ఇటీవల ట్రంప్‌ ప్రకటించారు. అయితే దీనివల్ల భారతీయ ఆటో మొబైల్‌-భాగాల ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఉక్కు పరిశ్రమల రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరించారు. దీంతో అగ్రరాజ్యానికి చెందిన కొన్నిరకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నామన్న విషయాన్ని భారత్‌ ప్రపంచ వ్యాణిజ్యసంస్థ దృష్టికి తీసుకువెళ్లింది. భారత స్టీల్‌, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా.. అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు దీనిలో వెల్లడించింది. ఈమేరకు ప్రపంచ వ్యాణిజ్యసంస్థ యూఎస్‌కు నోటీసులు పంపగా.. వాటిని అగ్రరాజ్యం తిరస్కరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని