Nimisha Priya: నిమిష ప్రియ విడుదల కోరుతూ..యెమెన్‌కు కుటుంబ సభ్యులు

Eenadu icon
By National News Team Updated : 28 Jul 2025 16:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya)ను దేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె విడుదలను కోరుతూ నిమిషప్రియ కుటుంబసభ్యులు యెమెన్‌కు వెళ్లారు. ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ (KA Paul) తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు. నిమిష ప్రియను వదిలేయాలని కోరుతూ ఆమె భర్త థామస్, కుమార్తె మిషెల్‌ అక్కడి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. వారితో పాటు కేఏ పాల్, ఇతరులు ఉన్నారు. తన భార్య మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేసినందుకు నిమిష ప్రియ భర్త థామస్ అక్కడి హూతీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

వీడియోలో పాల్‌  ద్వేషం కంటే ప్రేమ శక్తివంతమైనదిగా పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంతో అతలాకుతలమైన యెమెన్‌లో శాశ్వత శాంతి కోసం మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూ..నిమిష ప్రియను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

యెమెన్ జాతీయుడి హత్యకేసులో నిమిషకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. నిమిష, బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని యెమెన్‌ ప్రభుత్వాన్ని భారత్‌ పలుమార్లు కోరడంతో జులై 16న అమలు కావాల్సిన  మరణశిక్షను వాయిదా వేశారు. అయితే మృతుడు తలాల్‌ అదిబ్‌ మెహది కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. దీంతో నిమిష ప్రియ కేసులో ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. కేఏ పాల్‌ పర్యటనకు సంబంధించి భారత విదేశాంగశాఖ ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఆయనకున్న అంతర్జాతీయ పరిచయాలతో యెమెన్‌ వెళ్లినట్టు తెలుస్తోంది. 


Tags :
Published : 28 Jul 2025 16:46 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని