DK Shivakumar: ఆశపడటంలో తప్పులేదుగా.. ‘సీఎం పదవి’పై డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

Eenadu icon
By National News Team Updated : 07 Jul 2025 17:49 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెంగళూరు: కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశంపై రాజకీయం ఎంతకీ తెగట్లేదు. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని సిద్ధరామయ్య చెబుతున్నా.. తన చేతుల్లో ఏమీ లేదని డీకే శివకుమార్‌ (DK Shivakumar) అంటున్నా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం శివకుమార్‌ దీనిపై మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిని (Karnataka CM) కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదన్నారు.

రంభపురి పీఠాధిపతి శ్రీ రాజదేశికేంద్ర శివచార్య స్వామితో కలిసి డీకే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ పీఠాధిపతి మాట్లాడుతూ.. ‘‘2023 ఎన్నికల తర్వాత శివకుమార్‌కు ఉన్నత పదవి దక్కాల్సింది. ఎన్నికల్లో పార్టీ విజయానికి ఆయన ఎంతగా కృషి చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు’’ అన్నారు. దీనికి డిప్యూటీ సీఎం స్పందిస్తూ.. ‘‘కార్యకర్తలు, ప్రజలు, మఠాధిపతులకు తమ తమ సొంత అభీష్టాలు ఉంటాయి. వారి ఆశలు, ఆకాంక్షలను నేను తప్పుపట్టట్లేదు. కానీ, మేమంతా కలిసికట్టుగా ఈ పార్టీ (Congress)ని నిర్మించాం. ఈ పార్టీకి మేం క్రమశిక్షణ కలిగిన సైనికులం. కలిసి చర్చించుకుంటాం. పార్టీ నిర్ణయాన్ని అనుసరిస్తాం. సిద్ధరామయ్య (Siddaramaiah) కూడా ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పారు’’ అని డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించారు.

ఇలాంటి అనవసర విషయాలపై పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్షాలు, మీడియా చర్చించకూడదని హితవు పలికారు. కాంగ్రెస్‌పై విశ్వాసంతో రాష్ట్ర ప్రజలు తమకు అవకాశం కల్పించారని డిప్యూటీ సీఎం అన్నారు. వారి అంచనాలను అందుకునేలా తాము నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవల సీఎం సిద్ధరామయ్య కూడా దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, అందులో సందేహం ఎందుకని అన్నారు.

రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్‌ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే దీనిపై వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే, సిద్ధరామయ్యను గద్దె దించితే పార్టీ రెండుగా చీలిపోతుందని అధిష్ఠానం భయపడుతోంది. అందుకే.. ఆయనను కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

Tags :
Published : 07 Jul 2025 14:59 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు