Devendra Fadnavis: నేను అడిగితేనే శిందే అంగీకరించారు: ఫడణవీస్‌

Eenadu icon
By National News Team Updated : 06 Dec 2024 14:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Devendra Fadnavis | ముంబయి: భాజపా (BJP) సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) నేతృత్వంలో మహారాష్ట్ర (maharashtra)లో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను అడిగితేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. 

‘ఎన్నికల్లో విజయం తర్వాత జరిగిన మహాయుతి తొలి సమావేశంలో సీఎం అభ్యర్థి భాజపా నుంచి ఉండేందుకు ఏక్‌నాథ్‌ శిందే అంగీకరించారు. అయితే, శిందే ప్రభుత్వంలో భాగం కాకూడదని, మహాయుతి కూటమి సజావుగా సాగేందుకు నేతృత్వం వహిస్తే చాలని శివసేనలోని ఓ వర్గం భావించింది. తమ పార్టీ నుంచి సీఎం కావాలని శివసేన నాయకులు కోరుకున్నారు. వ్యక్తిగతంగా శిందేతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రమాణస్వీకారోత్సవానికి రెండు రోజుల ముందే నేను శిందేతో భేటీ అయ్యాను. అప్పుడే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించారు’ అని ఫడణవీస్‌ పేర్కొన్నారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాల్లో మహాయుతి కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే సీఎం ఎవరనే అంశంపై కూటమి నేతల మధ్య తీవ్రమైన చర్చలు జరిగాయి. భాజపా సీనియర్‌ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్‌కే ఆ బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు అందరూ ఊహించారు. అందుకుతగ్గట్టుగానే భాజపా కోర్‌ కమిటీ సమావేశంలో ఫడణవీస్ పేరును ప్రతిపాదించగా.. అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. 

మరోవైపు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన శిందే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు శిందే అంగీకరించడంతో ఆ ఊహాగానాలకు చెక్‌ పడింది. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిగా ఫడణవీస్‌, శివసేన అధినేత ఏక్‌నాథ్‌ శిందే, ఎన్సీపీ అగ్రనేత అజిత్‌పవార్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

Tags :
Published : 06 Dec 2024 13:57 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు