DK Shivakumar: మరో మూడు నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌!

Eenadu icon
By National News Team Updated : 29 Jun 2025 17:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెంగళూరు: కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) సీఎం పదవి స్వీకరిస్తారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.ఎ. ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..మళ్లీ అదే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మరో రెండు, మూడు నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని.. ప్రస్తుతం పార్టీ అధిష్ఠానం శివకుమార్‌ గురించే మాట్లాడుతోందన్నారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు గురించి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో శివకుమార్‌కు సన్నిహితుడైన ఇక్బాల్ హుస్సేన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ‘విప్లవాత్మక’ పరిణామాలు నెలకొంటాయని కర్ణాటక మంత్రి కె.ఎన్. రాజన్న ఇటీవల పేర్కొన్నారు. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు తథ్యమని అధికార పార్టీలోనూ విస్తృత చర్చ నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. నాయకత్వ మార్పు అనేది అధిష్ఠానం పరిధిలో ఉందని, దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించలేనని పేర్కొన్నారు. 

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారనే వార్తలూ వచ్చాయి. శివకుమార్‌ కూడా ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తాననే బహిరంగంగానే చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎక్కువ సీట్లలో గెలిస్తే తన పదవికి బలం చేకూరుతుందని చెప్పారు. మళ్లీ ఈ విషయం తెరపైకి రావడంతో కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Tags :
Published : 29 Jun 2025 17:03 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు