Tejashwi Yadav: రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : తేజస్వీ యాదవ్‌

Eenadu icon
By National News Team Updated : 19 Aug 2025 14:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) పేర్కొన్నారు. బిహార్‌ (Bihar)లో ఓటరు జాబితా సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ.. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ‘ఓటర్‌ అధికార యాత్ర’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం నవాడాలో జరిగిన ఈ యాత్రలో తేజస్వీ పాల్గొని మాట్లాడారు. 

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ కృషి చేస్తాయన్నారు. తేజస్వీ వ్యాఖ్యల సమయంలో రాహుల్‌ కూడా పక్కనే ఉన్నారు. ఇక, దీనికి ముందు తేజస్వీ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన వాస్తవాలతో కూడిన స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన స్ర్కిప్ట్‌ను ఆయన చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. ప్రాణాలతో ఉన్నవారిని చనిపోయినట్లు ఎందుకు పేర్కొంటున్నారో తమకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఒకవేళ ఆయన భాజపాలో సభ్యత్వం తీసుకొని ఉంటే చెప్పాలంటూ విమర్శలు చేశారు. ఓటర్‌ అధికార యాత్రకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తుందన్నారు. దీంతో ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి.. భాజపా ఓట్లను ఎలా దొంగిలిస్తుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. 

బిహార్‌లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ఓట్ల చోరీపై ప్రతిపక్షాలు కొంతకాలంగా పెద్దఎత్తున ఆందోళన వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ల విషయంలో భాజపాతో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతుందని రాహుల్‌ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన బిహార్‌లో ‘ఓటర్‌ అధికార యాత్ర’ చేస్తున్నారు. విపక్షాల ఆరోపణలపై ఇటీవల జ్ఞానేశ్ కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ ఆరోపణలపై తగిన ఆధారాలనైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వద్ద ఆధారాలు ఉంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సంతకం చేసి తమకు సమర్పించాలని ఈసీ అల్టిమేటం జారీ చేసింది. 

Tags :
Published : 19 Aug 2025 14:01 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు