Banking: బ్యాంకింగ్‌ రంగంలో విచిత్ర పరిస్థితి

Eenadu icon
By National News Desk Updated : 30 Jul 2025 06:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కనీస బ్యాలెన్స్‌ లేదని 5 ఏళ్లలో రూ.8,933 కోట్ల జరిమానా
క్లెయిమ్‌ చేసేవారు లేక ఖాతాల్లో మురిగిపోతున్న రూ.52,174 కోట్లు

ఈనాడు, దిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేనివారిపై బ్యాంకులు జరిమానా విధిస్తూ, రూ.వేల కోట్లు వసూలు చేసుకుంటుంటే.. మరోవైపు అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల రూపంలో వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో పేరుకుపోతున్నాయి. మంగళవారం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జునఖర్గే, భాజపా ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి ఇచ్చిన సమాధానం ఈ వైరుద్ధ్య చిత్రాన్ని వెల్లడించింది.

ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించలేని స్థితిలో ఉన్న ఖాతాదారుల నుంచి దేశంలోని 12 ప్రభుత్వరంగ బ్యాంకులు 2020-21 నుంచి 2024-25 మధ్య వసూలు చేసిన జరిమానా రూ.8,933 కోట్లుగా నమోదైంది. ఇందులో ఇండియన్‌ బ్యాంకు రూ.1,828.18 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (రూ.1,662.42 కోట్లు), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (రూ.1,531.62 కోట్లు), కెనరా బ్యాంకు (రూ.1,212.92 కోట్లు) ముందు వరుసలో ఉన్నాయి. ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు రూ.62.04 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 2020 మార్చి నుంచి ఎస్‌బీఐ ఒక్కటే ఎలాంటి జరిమానా విధించలేదు. మొత్తంగా బ్యాంకులు వసూలు చేసే జరిమానాలు ఐదేళ్లలో 90% పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి కెనరా, బరోడా, పంజాబ్‌ నేషనల్, ఇండియన్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంకులు ఈ జరిమానా రద్దు చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. 

మూడేళ్లలో 58% పెరిగిన అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు

బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు మూడేళ్లలో 58% పెరిగాయి. 2022 మార్చి 31కి దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల్లో కలిపి రూ.32,933.5 కోట్లుగా ఉన్న ఇలాంటి సొమ్ము 2024 మార్చి 31కి రూ.52,174.6 కోట్లకు పెరిగింది. కరెంటు, పొదుపుఖాతాల్లో ఉన్న డబ్బును పదేళ్లకు పైగా ఎవరూ వాడకుంటే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వాటిని అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లుగా పేర్కొంటారు. ఇలాంటి మొత్తాన్ని బ్యాంకులు డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేస్తాయి. అలా బదిలీ చేసిన నిల్వలు 2024 మార్చి 31కి రూ.52,174 కోట్లకు  చేరాయి.

Tags :
Published : 30 Jul 2025 04:23 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు