Chiranjeevi: చరణ్‌.. నేనెంతో గర్విస్తున్నా.. తనయుడి గురించి మెగాస్టార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

తన తనయుడు రామ్‌చరణ్‌ని ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు మెగాస్టార్‌ చిరంజీవి. చరణ్‌ విషయంలో తాను గర్వంగా ఉన్నట్లు చెప్పారు. 

Updated : 03 Dec 2022 09:09 IST

హైదరాబాద్‌: ఫ్యూచర్‌ ఆఫ్‌ యంగ్‌ ఇండియా కార్యక్రమంలో ట్రూ లెజెండ్‌గా తన తనయుడు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) అవార్డు సొంతం చేసుకోవడంపై మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ఆనందం వ్యక్తం చేశారు. చరణ్‌ అవార్డు అందుకోవడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు చెర్రీ ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘కంగ్రాట్స్‌ డియర్‌ చరణ్‌. ఫ్యూచర్‌ ఆఫ్‌ యంగ్‌ ఇండియాలో ట్రూ లెజెండ్‌ అవార్డు నువ్వు అందుకున్నందుకు నేనెంతో గర్విస్తున్నా. నువ్వు ఇలాగే ముందుకు సాగాలని అమ్మా నేనూ కోరుకుంటున్నాం’’ అని చిరు పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై చరణ్‌ స్పందిస్తూ.. ‘‘లవ్‌ యూ అప్పా’’ అని రిప్లై ఇచ్చారు.

వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఓ ఆంగ్ల ప్రతికా సంస్థ ఫ్యూచర్‌ ఆఫ్‌ యంగ్‌ ఇండియా అవార్డులను ఆదివారం అందజేసింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో రామ్‌చరణ్‌ ట్రూ లెజెండ్‌ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో చరణ్‌ మాట్లాడుతూ.. తన తండ్రి సేవలను కొనియాడారు. నటనలో చిరు వారసత్వాన్ని కొనసాగిస్తున్నానని, ట్రూ లెజెండ్‌ అవార్డు ఆయనకే అంకితం చేస్తున్నానని అన్నారు.

బాధ నుంచే పుట్టింది..!

‘‘కథ ఏదైనా సరే ఒక వ్యక్తిగత అనుభవం, సమస్య నుంచి మొదలువుతుంది. 1997లో మా కుటుంబానికి ఎంతో ఆప్తుడైన ఒక వ్యక్తి.. ఆపరేషన్‌ సమయంలో కావాల్సిన రక్తం దొరక్క కన్నుమూశాడు. 20వ శతాబ్దంలో రక్తం దొరక్క ఒక మనిషి కన్నుమూయడం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. ఆ బాధ నుంచే నాన్న బ్లడ్‌బ్యాంక్‌ మొదలు పెట్టారు. రక్తదానం చేయండి.. నాతో ఫొటో దిగే అవకాశాన్ని సొంతం చేసుకోండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. అలా, ఇప్పుడు ఆ బ్లడ్‌బ్యాంక్‌ ఎంతోమందికి ఉపయోగపడుతోంది’’ 

జక్కన్నకు రావాలి..!

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ బరిలోకి దిగడం ఎంతో ఆనందంగా ఉంది. చిత్రదర్శకుడు రాజమౌళికి ఆ అవార్డు రావాలని నేను కోరుకుంటున్నా. ఆయన దానికి అర్హుడు. ‘నాటు నాటు’ అంటే ఒక డ్యాన్స్‌ లేదా వీడియో మాత్రమే కాదు. స్నేహం. ఇద్దరి వ్యక్తుల మధ్య అనుబంధం. దక్షిణాదిలో మా కుటుంబానికి, తారక్‌ ఫ్యామిలీకి పోటీ ఉంది. ఈ సినిమాని ఇరు కుటుంబాలకు చెందిన అభిమానులు కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు’’ అని చరణ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని