Chiranjeevi: ఇలాంటి చిత్రాలు గొప్పగా ఆడాలి: చిరంజీవి

కచ్చితంగా ఇలాంటి చిత్రాలు గొప్పగా ఆడాలి. ఈ తరహా సినిమాలు చూస్తున్నప్పుడు మనలోని దేశభక్తి ఉప్పొంగుతుంది.

Updated : 26 Feb 2024 06:37 IST

కచ్చితంగా ఇలాంటి చిత్రాలు గొప్పగా ఆడాలి. ఈ తరహా సినిమాలు చూస్తున్నప్పుడు మనలోని దేశభక్తి ఉప్పొంగుతుంది. ముఖ్యంగా యువతరం దీన్ని ఓ బాధ్యతగా ఆదరించాలి. మన దేశ సైనికులు చలిలోనూ.. మండే ఎండల్లోనూ.. ఎడారుల్లోనూ నిద్రహారాలు మాని, ఎలా కాపలా కాస్తున్నారో ప్రతి ఒక్కరూ చూడాలి. అలాంటి రియల్‌ హీరోలకు ఇలాంటి  చిత్రాలు చూసి ఓ సెల్యూట్‌ చేయాలి.

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు వరుణ్‌ తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శక్తిప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మానుషి చిల్లర్‌ కథానాయిక. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో మార్చి 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. అది గుర్తొచ్చినప్పుడల్లా మనసు హృదయవిదారకరంగా ఉంటుంది. ఆ దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించేలా.. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు మన భారత వైమానిక దళం చేసిన సాహసోపేతమైన యుద్ధమే ఈ సినిమా.

పరిశోధన చేసి మరీ..

కమర్షియల్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలన్న కాంక్షతో శక్తిప్రతాప్‌ ఈ సినిమా చేయలేదు. తనెప్పుడూ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని దేశానికి సేవలు చేసే భారత ఆర్మీపై పరిశోధన చేస్తుంటాడు. ఈ చిత్రాన్ని కూడా తను ఎంతో పరిశోధన చేసి.. చాలా వాస్తవికంగా తెరపైకి తీసుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమాని తక్కువ బడ్జెట్‌లో.. 75రోజుల్లోనే ఎంతో నాణ్యతతో తెరకెక్కించాడు శక్తి. ట్రైలర్‌లో కనిపించిన విమానాలు.. విజువల్స్‌ చూస్తుంటే ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత గొప్ప నాణ్యమైన సినిమా తీశారా అని ఆశ్చర్యం కలుగుతోంది. డబ్బు ఖర్చు పెడితేనే రిచ్‌నెస్‌ రాదు.. అది మన ఆలోచనల్లో ఉండాలి. తక్కువ బడ్జెట్‌లో తీసి ఎలా రిచ్‌గా చూపిస్తే బాగుంటుందో దర్శకులు ఆలోచించాలి. అప్పుడు నిర్మాతలు బాగుంటారు. ఇండస్ట్రీ బాగుంటుంది. వరుణ్‌ మొదటి నుంచీ వైవిధ్యభరితమైన కథలతోనే ప్రయాణిస్తూ వస్తున్నాడు. మా కుటుంబంలో మిగతా హీరోలెవరికీ రాని అవకాశమిది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎయిర్‌ ఫోర్స్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌పై ఈ సినిమా చేశాడు. ఈతరహా జానర్‌లో వచ్చిన తొలి తెలుగు చిత్రమిదే. దీన్ని మార్చి 1న థియేటర్లలో చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. విజయవంతం చేసి మన వీర సైనికులకు సెల్యూట్‌ చేయాల్సిన బాధ్యత అందరిదీ’’ అన్నారు.

సెల్యూట్‌ కొడతారు

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతోనే నేనెప్పుడూ కష్టపడుతుంటాను. ఈ చిత్రాన్ని శక్తిప్రతాప్‌ ఓ కొత్త కాన్సెప్ట్‌తో.. మన దేశ వైమానిక దళ వీరుల త్యాగాల్ని, గొప్పతనాన్ని చాటేలా ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా చూసి ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వాడు గుండెలపై చేయి వేసుకొని మన జవాన్లకు సెల్యూట్‌ కొడతారు. అలా ఉండనుంది ఈ సినిమా. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి’’ అన్నారు. ‘‘సమష్టి కృషికి ఫలితం ఈ చిత్రం. ఈ సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు నేనెప్పుడూ వరుణ్‌ తేజ్‌ను చూడలేదు. యువ వయసులో ఉన్న చిరంజీవి, నాగబాబును తనలో చూశాను. దీంట్లో యాక్షన్‌, ఎమోషన్‌, డ్రామా, అడ్వెంచర్‌, దేశభక్తి.. ఇలా చాలా అంశాలున్నాయి. తప్పకుండా థియేటర్లలో చూడండి. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో నాగబాబు, అభిషేక్‌ అగర్వాల్‌, సిద్ధూ ముద్దా, నంద కుమార్‌, శశి, విజయ్‌, రామజోగయ్య శాస్త్రి, కరుణ కుమార్‌, సాగర్‌ కె చంద్ర, కృష్ణ చైతన్య, నవదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు