సంక్షిప్త వార్తలు (4)

Eenadu icon
By Cinema Desk Updated : 01 Nov 2025 06:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కన్నునొదిలి కనుపాప ఉంటుందా...! 

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా... నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. కామాక్షి భాస్కర్ల కథా నాయిక.   శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్‌కుమార్‌ సమర్పకులు. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్‌ చిత్రాల ఫేమ్‌ డా.అనిల్‌ విశ్వనాథ్‌ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. ‘కన్నొదిలి... కలనొదిలి కనుపాపే ఉంటుందా...’ పాట విడుదలతో శుక్రవారం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటకి, దేవ్‌ పవార్‌ సాహిత్యం అందించారు. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ ఆలపించారు. నాయకానాయికల మధ్య మంచి కెమిస్ట్రీ, అద్భుతమైన విజువల్స్‌తో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ‘‘ప్రేమ, థ్రిల్లింగ్‌ అంశాలతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉంది. టీజర్‌తోనే ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్‌ అనుభవాన్ని పంచుతుందనే అంచనాల్ని పెంచిన ఈ చిత్రం నవంబరు 21న ప్రేక్షకుల ముందుకొస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సాయికుమార్, వైవా హర్ష, గెటప్‌ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కుశేందర్‌ రమేశ్‌రెడ్డి. 


వంద శాతం వినోదం పంచుతాం 

యువతరం ప్రేక్షకులు తమతోపాటు తల్లిదండ్రుల్ని థియేటర్‌కి తీసుకెళ్లి చూపించాలనుకునే సినిమా ఇదని చెప్పారు ఆర్‌.పి.పట్నాయక్‌.  ఆయన స్వర కల్పనలో త్రినాథ్‌ కటారి కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సాహితీ అవంచ కథానాయిక. సంజీవని ప్రొడక్షన్స్‌ పతాకంపై బళ్లారి శంకర్‌ నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా త్రినాథ్‌ కటారి మాట్లాడుతూ ‘‘ఇదొక తండ్రీ కొడుకుల కథ, తండ్రీ కూతుళ్ల కథ, అమ్మాయి అబ్బాయి కథ. సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌కి కథ చెబుతున్నప్పుడే ఒక హిట్‌ సినిమా చేయబోతున్నాం అన్నారు. ఆయన చెప్పిన ఆ మాట ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ప్రేక్షకులకు వంద శాతం వినోదం పంచబోతున్నాం’’ అన్నారు. సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ మాట్లాడుతూ ‘‘నాకు బాపు సినిమాకి పనిచేసే అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుందనే అభిప్రాయం కలిగింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం అందించడంతో సినిమా స్థాయి పెరిగింది’’ అన్నారు.


‘నేను రెడీ’కి మిక్కీ స్వరాలు 

హవీశ్‌ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘నేను రెడీ’. నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్‌ కథానాయిక. శ్రీలక్ష్మి, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ  సినిమాకి మిక్కీ జె మేయర్‌ సంగీతమందిస్తున్నట్లు  శుక్రవారం ప్రకటించారు. ‘‘ప్రస్తుతం చిత్రీకరణతో పాటు సంగీత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: నిజార్‌ షఫీ.


థ్రిల్‌ చేసే సందిగ్ధం

నిహాల్, ప్రియా దేశ్‌ పాగ్, అర్జున్‌ దేవ్, కాజల్‌ తివారి ప్రధాన పాత్రల్లో పార్థ సారథి కొమ్మోజు తెరకెక్కించిన చిత్రం ‘సందిగ్ధం’. సంధ్య తిరువీధుల నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్‌ కుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. భార్యాభర్తలైన సంధ్య, పార్థు కష్టపడి తీసిన ఈ సినిమా విజయవంతమవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇదొక విభిన్నమైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌. ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తూ సాగుతుంది’’ అన్నారు దర్శకుడు పార్థ సారథి.

Tags :
Published : 01 Nov 2025 01:35 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు