‘వారణాసి’ జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం: మహేశ్‌బాబు

Eenadu icon
By Entertainment Team Published : 16 Nov 2025 00:10 IST
Ee
Font size
  • A
  • A+
  • A++
2 min read

హైదరాబాద్‌: ‘ప్రతి నటుడి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసే సినిమా, పాత్ర ఒకటి ఉంటుంది. నాకు ‘వారణాసి’ అలాంటిదే’ అంటున్నారు మహేశ్‌బాబు (Mahesh Babu). ఆయన కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ఇది. ప్రియాంక చోప్రా జోన్స్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీలో (Ramoji Film City) ఈ మూవీ టైటిల్‌, స్పెషల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడారు. తనని, తన సినిమాలను ఆదరిస్తున్న అభిమానులకు చేతులెత్తి నమస్కారం చేశారు. వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు.

‘‘మిమ్మల్ని (అభిమానులు) కలుసుకుని చాలా రోజులైంది. ఇలా ఈ ఈవెంట్‌లో కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను నా వరకూ సాధారణంగా వచ్చేస్తానని చెప్పాను. కానీ, దర్శకుడు రాజమౌళి ఇలా స్పెషల్‌గా మీ ముందుకు తీసుకొచ్చారు. నాన్న కృష్ణగారు ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో ఎప్పుడూ ఆయన మాట వినలేదు. ఇప్పుడు నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి’’

‘‘ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ప్రాజెక్ట్‌. దీనికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. మరీ ముఖ్యంగా నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ‘వారణాసి’ విడుదలైనప్పుడు ఈ మూవీ చూసి, యావత్‌ దేశం గర్వపడుతుంది. ఇది టైటిల్‌ ప్రకటన మాత్రమే. మున్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇలా ఎప్పుడూ మీ సపోర్ట్‌ ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపే అభిమానానికి ‘థ్యాంక్స్‌’ అన్నది చిన్న మాట అవుతుంది.  మీరు చూపించే అభిమానం మాటల్లో చెప్పలేను. మీ ఆశీస్సులు, అభిమానం నాతోనే ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఈవెంట్‌ సజావుగా సాగడానికి సహకరించిన పోలీస్‌శాఖకు నా ధన్యవాదాలు’ అని అన్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2027 (mahesh rajamouli movie release date) వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

లైవ్ టీవీ