Shami - Hasin Jahan: దాంతో పోల్చొద్దు.. రూ. 4 లక్షలు చాలా తక్కువ: షమీ భార్య హసీన్‌

Eenadu icon
By Sports News Team Published : 03 Jul 2025 07:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పాత చిత్రం

ఇంటర్నెట్ డెస్క్‌: విడిగా ఉంటోన్న భార్య, కుమార్తె సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షలను భరణం కింద చెల్లించాలని భారత పేసర్ మహ్మద్ షమీకి కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రూ. 1.5 లక్షలు భార్య హసీన్‌ జహాన్‌ కోసం, రూ.2.5 లక్షలు కుమార్తె కోసం వెచ్చించేందుకు చెల్లించాలని పేర్కొంది. ఈ అంశంపై షమీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కోర్టు తీర్పుపై హసీన్‌ సంతోషం వ్యక్తంచేశారు. దాదాపు ఏడేళ్ల నుంచి చేస్తోన్న పోరాటానికి న్యాయం జరిగిందని తెలిపారు. అయితే, షమీ స్థాయిని బట్టి ఈ భరణం చాలా తక్కువని.. మేం రూ. 10 లక్షల వరకు కోరినట్లు వ్యాఖ్యానించారు. 

‘‘సుదీర్ఘంగా మేం చేసిన పోరాటానికి ఇప్పుడు విజయం దక్కింది. ఇప్పుడు నా కుమార్తెకు మంచి విద్యను అందించగలను. ఆమె లైఫ్‌ సాఫీగా ముందుకు తీసుకెళ్లగలను. అయితే, షమీ స్థాయి, అతడి జీవన విధానం, సంపాదన చూస్తే ఈ భరణం చాలా తక్కువే. అందుకే దాంతో అస్సలు పోల్చకూడదు. ఏడేళ్ల కిందటే మేం అతడి నుంచి నెలకు రూ. 10 లక్షల వరకు ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాం. అప్పటినుంచి అతడి ఆదాయం, ఖర్చులు కూడా పెరిగాయి. షమీ ఎలా తన జీవితాన్ని గడుపుతున్నారో.. నేనూ, నా కుమార్తె కూడా అదే స్థాయిని కొనసాగించే హక్కు ఉంది’’ అని జహాన్‌ వెల్లడించారు.

పెరిగే అవకాశం ఉంది: జహాన్‌ లాయర్

‘‘హసీన్‌ జహాన్‌, ఆమె కుమార్తెకు ఇవి అద్భుతమైన క్షణాలు. 2018 నుంచి ఆమె చాలా ఇబ్బందులు పడింది. ఇప్పుడు కోర్టు తీసుకున్న నిర్ణయంతో న్యాయం జరిగింది. జహాన్‌ ఖర్చుల కోసం రూ. 1.5 లక్షలు, కుమార్తె కోసం రూ. 2.5 లక్షల చొప్పున నెలకు చెల్లించాలి. అలాగే కుమార్తెకు ఇంకేమైనా అవసరమైతే షమీ అందించాలి. మధ్యంతర ఉత్తర్వుల్లోని ప్రధాన దరఖాస్తును ట్రయల్‌ కోర్టు ఆరు నెలల్లో పరిష్కరించాలని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ క్రమంలో భరణంపై విచారణ ముగిసేనాటికి ఇప్పుడున్న రూ.4 లక్షలను రూ.6 లక్షల వరకూ పెంచే అవకాశం లేకపోలేదు. హసీన్‌ తన భరణ దరఖాస్తులో రూ. 10 లక్షల వరకు క్లెయిమ్ చేశారు’’ అని జహాన్‌ న్యాయవాది ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు