Shikhar dhawan: సంజూ కన్నా ముందు ఒకరున్నారు.. వేచి చూడాల్సిందే: శిఖర్‌ ధావన్‌

రిషభ్‌ పంత్‌ గత విజయాలే అతడికి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతోందని కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు.

Published : 01 Dec 2022 01:23 IST

దిల్లీ: సంజూ శాంసన్‌కు బదులు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రిషభ్‌ పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంపై జట్టు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ తాజాగా స్పందించాడు. పంత్‌ విషయంలో తాము తీసుకొన్న నిర్ణయం సరైందేనని తెలిపాడు. గొప్పగా ఆడిన వ్యక్తికి కచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ విషయంలో సంజూ మరికొంత కాలం వేచి ఉండాలన్నాడు.

‘‘పంత్‌ ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో శతకంతో నిరూపించుకున్నాడు. కాబట్టే జట్టులో ఉన్నాడు. ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఎంతో దూరదృష్టితో ఆలోచించవలసి ఉంటుంది. సంజూ కచ్చితంగా గొప్ప ఆటగాడే. అతడికి ఇచ్చిన అవకాశాలను బాగా ఉపయోగించుకున్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినప్పటికీ అతడికన్నా ముందు ఒక ఆటగాడు రాణిస్తే అతడికే అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. సంజూ అవకాశాల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు. పంత్‌ మ్యాచ్‌ విన్నర్‌. అతడి సామర్థ్యం గురించి మాకు తెలుసు. సరిగా ఆడలేకపోతున్న సమయంలో అతడికి ఈ మాత్రం ప్రోత్సాహం అవసరం’’ అని ధావన్‌ తెలిపాడు. 

కివీస్‌తో సిరీస్‌లో తొలి వన్డేలో మాత్రమే ఆడిన సంజూ 36 పరుగులతో మెప్పించిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌ స్థానం కోసం దీపక్‌ హుడాను ఎంచుకొన్న సెలక్టర్లు సంజూను పక్కనపెట్టారు. ఇక బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో డారిల్‌ మిచెల్‌ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్‌ చేతికి చిక్కిన పంత్‌(10) మరోసారి విఫలమయ్యాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని