కోహ్లీ ఓపెనింగ్‌ చేయడం ఆశ్చర్యమేసింది.. వారిద్దరిలో ఒకరు అయితే బాగుండేది: జాఫర్

రెండో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి బదులు మరొకరిని ఓపెనర్‌గా పంపిస్తే బాగుండేదని టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ కచ్చితంగా వన్‌డౌన్‌లోనే ఆడాల్సిందని పేర్కొన్నాడు.

Updated : 08 Dec 2022 19:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే చేజార్చుకొంది. కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయం కావడంతో ఓపెనర్‌గా దిగలేకపోయాడు. కానీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో రోహిత్‌కు బదులు శిఖర్ ధావన్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చాడు. అయితే ఇద్దరూ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వసీ జాఫర్ పలు కీలక వ్యాఖ్యలతోపాటు సూచనలు చేశాడు. విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపించకుండా ఉండాల్సిందని, అతడి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌కు అవకాశం ఇస్తే బాగుండేదని పేర్కొన్నాడు. 

‘‘రోహిత్ చేతికి గాయం కావడం.. ధావన్‌తో ఓపెనింగ్‌ ఎవరు చేయాలనే దానిపై కాస్త సందిగ్ధత ఏర్పడినట్లు ఉంది. దీంతో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వచ్చాడు. అయితే కోహ్లీకి బదులు కేఎల్ రాహుల్‌ కానీ, వాషింగ్టన్‌ సుందర్‌ కానీ బ్యాటింగ్‌కు వస్తే బాగుండేది. మరీ ముఖ్యంగా రాహుల్‌ అయితే ఇంకా బాగుండు. ఎందుకంటే ఇప్పటికే అతనికి ఇతర ఫార్మాట్లలోనూ ఓపెనింగ్‌ చేసిన అనుభవం ఉంది. అలా కాకుండా మరొకరిని ఓపెనర్‌గా పంపిచాలని భావిస్తే వాషింగ్టన్‌ సుందర్‌ మంచి ఎంపిక. విరాట్ కోహ్లీ తప్పకుండా మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలి. శ్రేయస్‌ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్‌ ఐదో స్థానంలో వస్తే సరిపోయేది. కానీ విరాట్ ఓపెనర్‌గా వచ్చేసరికి కాస్త ఆశ్చర్యమనిపించింది. త్వరగా ఔట్‌ కావడం కూడా తర్వాతి బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది’’ అని వసీం జాఫర్ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని