Medaram: మహాజాతరకు ముందే మేడారం అభివృద్ధి

Eenadu icon
By Telangana News Desk Updated : 09 Sep 2025 06:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు

మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.
చిత్రంలో శ్రీనివాసరాజు, లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖ, పొంగులేటి, సీతక్క, శైలజా రామయ్యర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క- సారలమ్మ ఆలయం వద్ద పూర్తిగా సహజసిద్ధమైన రాతితో కట్టడాలు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్‌ దారులు ఏర్పాటు చేయాలని... పార్కింగ్‌ సౌకర్యం విశాలంగా ఉండాలన్నారు. నిర్మల్‌ జిల్లా బాసరలోని జ్ఞానసరస్వతీదేవి ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయాలని సూచించారు. దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సంప్రదాయాలను... నిపుణులు, పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సోమవారం ముఖ్యమంత్రి తన నివాసంలో మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. రెండు ఆలయాల అభివృద్ధికి రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లను పరిశీలించారు. బాసర ఆలయ మాస్టర్‌ప్లాన్‌పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘మేడారంలో వంద రోజుల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసి... వచ్చే మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక అమలు చేయాలి. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా జంపన్న వాగులో నీరు నిలిచేలా చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి. ఈ వారంలో మేడారానికి వచ్చి పరిశీలిస్తాను’’ అని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దేవాదాయశాఖ, సీఎంవో ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. 

15 నుంచి పనులు..

సీఎంతో సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి తన కార్యాలయంలో మంత్రులు సురేఖ, సీతక్క, లక్ష్మణ్‌కుమార్, అధికారులతో కలిసి మేడారంపై సమీక్ష నిర్వహించారు. మేడారం జాతరకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని ఆయన తెలిపారు. సీఎం సూచనల మేరకు ఆలయ ఆధునికీకరణ పనులను ఈ నెల 15న ప్రారంభించి... జనవరి మొదటి వారంలోగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు.

Tags :
Published : 09 Sep 2025 04:34 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు