panchayat elections: కాంగ్రెస్‌.. అదే జోష్‌

Eenadu icon
By Telangana News Desk Updated : 15 Dec 2025 06:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

రెండో విడతలోనూ సగానికి పైగా సర్పంచి స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారుల విజయభేరి 
27 జిల్లాల్లో మెజార్టీ సీట్లు ‘హస్త’గతం
గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి 
నిర్మల్‌ జిల్లాలో భాజపాకుఅత్యధిక స్థానాలు 
అర్ధరాత్రి 12.30 గంటల వరకు అందిన ఫలితాలివీ..
85.86% పోలింగ్‌ నమోదు

రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఓటు వేయటానికి చంటిబిడ్డలతో వస్తున్న మహిళలు  

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. మొత్తం 4,333 స్థానాల్లో సగాని కంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్‌ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్‌  బలపరిచిన వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. భాజపా మద్దతుదారులకు నిర్మల్‌ జిల్లాలో మెజారిటీ స్థానాలు వచ్చాయి. అర్ధరాత్రి 12.30 గంటల వరకు కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 2,297 (51.9%), భారత రాష్ట్ర సమితి 1,191 (27.5%), భాజపా 257 (6.2%), ఇతరులు 578(14.4%) పొందారు. వీరిలో సీపీఎం మద్దతుదారులు 33 చోట్ల, సీపీఐ బలపరిచినవారు 28 చోట్ల గెలిచారు. మొదటి విడతలో కాంగ్రెస్‌ మద్దతుదారులు 2,425 చోట్ల, భారత రాష్ట్ర సమితి 1,168, భాజపా 189, ఇతరులు 448 చోట్ల గెలుపొందారు.

మండలాల వారీగా రెండో దశ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి..

ఓటెత్తిన పల్లెలు

వణికించే చలిలోనూ ఓటర్లలో ఉత్సాహం వెల్లువెత్తింది. ఉదయం నుంచే బారులు తీరారు. 85.86 శాతం పల్లె ప్రజలు ఓటు వేశారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడతలో నమోదైన(84.28%) పోలింగ్‌ కన్నా ఇది 1.58 శాతం ఎక్కువ. ఆదివారం సెలవురోజు కావడంతో పోలింగ్‌ శాతం పెరిగింది. రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచి, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మంచిర్యాల, వరంగల్‌ జిల్లాల్లోని ఒక్కొక్క గ్రామంలో, నల్గొండ జిల్లాలోని మూడు గ్రామాల్లో, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో రెండు గ్రామాల్లో, 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. ఆదివారం 193 మండలాల్లోని 3,911 గ్రామపంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్యులకు పోటీపడ్డారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72 శాతం పోలింగ్‌ నమోదైంది.

నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో ఓటు వేసిన గోలి వెంకటమ్మ (96) 

నిజామాబాద్‌లో అత్యల్పంగా  76.71% మంది ఓట్లేశారు. 29 జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. మొత్తం ఓటర్లు 54,40,339కు గాను 46,70,972 మంది ఓటు వేయగా వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 27,82,494 మంది మహిళా ఓటర్లలో 23,93,010.. పురుష ఓటర్లు 26,57,702లో 22,77,902 మంది.. ఇతరుల్లో 143కు 60 మంది ఓట్లు వేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల తీరును అధికారులు పర్యవేక్షించారు. 1 గంటకు  పోలింగు ముగియగా... మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. పోటీ హోరాహోరీగా జరగడంతో చాలా చోట్ల ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది. పలు చోట్ల ఒకటి, రెండు.. ఇలా తక్కువ మెజార్టీతోనూ చాలా మంది విజయం సాధించారు. ఆదివారం రాత్రి రెండో విడత ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచి ఎన్నికలను అధికారులు నిర్వహించారు. వార్డు సభ్యులను సమావేశపరిచి ఉపసర్పంచులను ఎన్నుకున్నారు. 

27 జిల్లాల్లో కాంగ్రెస్‌ 

నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి, ములుగు ,మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాల్లో మెజారిటీ స్థానాలు గెలిచారు.  

మూడు జిల్లాల్లో భారత రాష్ట్ర సమితి

సిద్దిపేట, కుమురంభీం, జనగామలలో భారత రాష్ట్ర సమితి మద్దతుదారులు ముందున్నారు.

ఒక జిల్లాలో భాజపా

నిర్మల్‌ జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించిన భాజపా మద్దతుదారులు.. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ తర్వాత నిలిచారు. 

సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు 

 

మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం బుద్దారం గ్రామంలో చుట్టూ రేకులు కట్టి, పైకప్పు లేకుండా పరదాలతో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఓటర్లు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


కాళ్లు విరిగినా.. ఓటు కర్తవ్యంలో

సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచారుపల్లికి చెందిన బోనాల లక్ష్మి ఇటీవల రోడ్డుప్రమాదంలో రెండు కాళ్లు విరిగి చికిత్స పొందుతుండగా.. ఆదివారం పోలింగ్‌ కేంద్రానికి ఆటోలో వచ్చారిలా.. 


రెండు ఓట్లు.. మూడు చుక్కలు

సిద్దిపేట జిల్లా అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన మైసాని నర్సింలుకు కంటిచూపు లేకపోవడంతో పోలింగ్‌బూత్‌కు ఆయన భార్య మల్లవ్వతో వెళ్లి ఆమె ద్వారా తాను కోరుకున్న గుర్తుకు ఓటు వేశారు. తరువాత మల్లవ్వ కూడా ఓటు వేయగా.. దీనితోపాటు భర్తకు సాయం చేసినందుకు కలిపి పోలింగ్‌ సిబ్బంది ఆమె రెండు వేళ్లకు సిరా చుక్కలు వేశారు. 

ఈనాడు, సిద్దిపేట 


నేనున్నాననీ..

మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన రాములమ్మ అనే వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉండటంతో అక్కడే ఉన్న ఎస్సై తిరుపాజీ ఆమెను ఇలా ఎత్తుకొని తీసుకెళ్లారు.


వీలుచేసుకొని వీల్‌చైర్‌లో..

వనపర్తి మండలం మెంటెపల్లి గ్రామంలో ఓటు వేయడానికి వీల్‌చైర్‌లో వచ్చిన 104 ఏళ్ల మాణిక్యమ్మ


Tags :
Published : 15 Dec 2025 04:59 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని