బాస్‌లందరూ ఇన్‌ఛార్జులే!

Eenadu icon
By Telangana News Desk Updated : 28 Oct 2025 05:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పెద్దాసుపత్రుల్లో కిందిస్థాయి సిబ్బందిపై నిఘా కరవు
పర్యవేక్షణ కొరవడి రోగుల ఇక్కట్లు

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో తాజాగా ఇద్దరు చిన్నారులకు ఒకే ఆక్సిజన్‌ సిలిండర్‌ పెట్టి పరీక్షలకు పంపడం..అది లీక్‌ అవ్వడం సంచలనంగా మారింది. పేషెంట్‌ కేర్‌ సిబ్బంది నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఇన్‌ఛార్జ్‌ సూపరింటెండెంట్‌ కిశోర్‌ను ఆ పదవి నుంచి తప్పించింది. ఇప్పుడు మరొకరిని ఇన్‌ఛార్జ్‌ పర్యవేక్షకులుగా నియమించనుంది. 1200కి పైగా పడకలతో ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలోనూ రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌ పోస్టు లేకపోవడంతో దశాబ్దాలుగా ఇన్‌ఛార్జులనే పర్యవేక్షకులుగా నియమించాల్సి వస్తోంది. ఇక ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న నిలోఫర్‌ పిల్లల ఆసుపత్రి, ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి, సరోజినిదేవి కంటి ఆసుపత్రి, ఫీవర్, ఛాతి తదితర 8 ఆసుపత్రుల్లో పర్యవేక్షకులు ఇన్‌ఛార్జులే. ఈ స్థానాల్లో అడిషనల్‌ డీఎంఈ స్థాయి వైద్యులు పనిచేయాలి. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్‌ల కోసం రెగ్యులర్‌ పోస్టులు కల్పించింది. ఇటీవల ‘డీపీసీ’ పూర్తి చేసి సుమారు 43 మందికి అడిషనల్‌ డీఎంఈలుగా పదోన్నతి కల్పించింది కానీ నిత్యం వేలమంది రోగులతో కిటకిటలాడే అనేక పెద్దాసుపత్రుల్లో మాత్రం రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌ పోస్టులను కల్పించకపోవడం గమనార్హం.

పూర్తి అధికారాలు లేక..

ఇన్‌ఛార్జుల పాలనలో పర్యవేక్షణ కొరవడి ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆసుపత్రిలో ఉన్న వారిలో సీనియర్లను లేదా మరో ఆసుపత్రి నుంచి సీనియర్లను ఇన్‌ఛార్జులుగా నియమిస్తున్నారు. వీరికి ఆసుపత్రిలో పరిపాలన అంశాల పరంగా పూర్తి అధికారాలు ఉండట్లేదు. పరికరాలు, రూ.5 లక్షల లోపు మందుల కొనుగోళ్లు, చిన్నచిన్న నిర్మాణాలకు సంబంధించిన పనుల అనుమతులపై వీరు వెంటనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రోగులకు అవస్థలు తప్పట్లేదు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమితులైన పేషెంట్‌ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయినా ఇన్‌ఛార్జ్‌ పర్యవేక్షకులు వారిపై చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.

వరంగల్‌ ఎంజీఎంలో గతేడాది కాలంలో ఇద్దరు ఇన్‌ఛార్జ్‌ సూపరింటెండెంట్లు మారారు. నిలోఫర్‌ ఆసుపత్రిలో సైతం గత ఇన్‌ఛార్జ్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో మరొకరికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. ఈ విధానంతో ఎవరికీ పాలనపై పట్టు రావట్లేదు. ఈ నేపథ్యంలో పెద్దాసుపత్రుల్లో రెగ్యులర్‌ పర్యవేక్షకుల కల్పన, నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

Tags :
Published : 28 Oct 2025 04:42 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు