త్వరితగతిన వైద్య కళాశాలల నిర్మాణం

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 04:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

భవనాలకు రూ.285 కోట్లు కేటాయింపు

కామారెడ్డిలో నిర్మితమవుతున్న వైద్య కళాశాల భవనం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల భవనాల నిర్మాణాలను పూర్తిచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖకు మంజూరుచేసిన నిధుల్లో సింహభాగం వీటి నిర్మాణానికి కేటాయించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధుల్లో రూ.285 కోట్లను వైద్య కళాశాలల నిర్మాణానికి తాజాగా కేటాయించారు.

దశలవారీగా నిర్మాణం..

వైద్య కళాశాలల భవనాల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం వీటిని దశలవారీగా చేపడుతోంది. మొదటిదశలో 8 భవనాల నిర్మాణాన్ని పూర్తిచేస్తారు. రెండోదశలో 9, మూడోదశలో 8 భవనాలను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 2023లో మొదటిదశలో కరీంనగర్, వికారాబాద్, ఖమ్మం, జనగామ, కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల, భూపాలపల్లి పట్టణాల్లో కళాశాలలు ప్రారంభమయ్యాయి. డిసెంబరుకల్లా వీటి భవనాలు పూర్తిచేయాల్సి ఉంది.

వైద్య విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మొదటిదశలో నిర్మించిన కళాశాల భవనాలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం రెండు, మూడు దశల భవనాల నిర్మాణంపై దృష్టి సారించనుంది. మొదటి రెండు దశల్లోని భవనాలను రహదారులు, భవనాలశాఖ నిర్మిస్తుండగా గతఏడాది కొత్తగా ప్రారంభమైన 8 కళాశాలల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం ‘ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఈడబ్ల్యుఐడీసీ)’కి అప్పగించింది. 

‘టిమ్స్‌’కు రూ.105 కోట్లు 

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నిధుల్లో రూ.105 కోట్లు సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌ టిమ్స్‌ ఆసుపత్రులతోపాటు, వరంగల్‌ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి కేటాయించారు. సనత్‌నగర్‌ టిమ్స్‌ను ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో ఈ నిధుల్లో ఎక్కువ శాతం ఈ ఆసుపత్రికి కేటాయించే అవకాశం ఉంది. అలాగే రూ.90 కోట్లను రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ)కి కేటాయించారు. ఈ నిధులతో టిమ్స్‌ ఆసుపత్రులకు సంబంధించి అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు రంగం సిద్ధమవుతోంది. మరో రూ.20 కోట్లు వైద్య ఆరోగ్యశాఖలో ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్లు సమాచారం. 

వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో ప్రక్షాళన కావాలంటే మాత్రం భారీమొత్తంలో నిధుల అవసరం ఉంది. ప్రపంచబ్యాంకు రుణంగా రూ.4,150 కోట్లు వైద్య ఆరోగ్యశాఖకు రానున్నాయి. ఈ నిధులు విడుదలైతే వైద్య కళాశాలలు, ఇతర ఆసుపత్రుల నిర్మాణం.. వైద్య పరికరాల కొనుగోలు, ట్రామా కేంద్రాల ఏర్పాటు వంటివన్నీ సాకారమయ్యే వీలుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు