బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టడంపై నివేదికివ్వండి: లోకాయుక్త

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 04:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు అనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ను బతికుండగానే మార్చురీలో పెట్టిన సంఘటనపై నివేదిక సమర్పించాలంటూ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్, మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్యాధికారులకు లోకాయుక్త జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్‌ ఆసుపత్రిలో ఆధార్‌కార్డు లేదని చికిత్స నిరాకరించడంతో బాధితుడు రాజు మార్చురీ ముందు నిస్సహాయంగా పడుకోగా.. మృతిచెందారని భావించి మార్చురీలో ఉంచిన ఘటనను ‘ఈనాడు’తో సహా పలు పత్రికలు ప్రచురించాయి. ఈ కథనాల్ని సుమోటోగా తీసుకున్న లోకాయుక్త.. నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను నవంబరు 12కు వాయిదా వేశారు.

మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో బతికున్న వ్యక్తిని సిబ్బంది మార్చురీలో పెట్టారన్న ఘటనపై వైద్య విద్య సంచాలకుడు(డీఎంఈ) నరేంద్రకుమార్‌ శుక్రవారం విచారణకు ఆదేశించారు. దీని కోసం ములుగు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్, జనగామ ఆసుపత్రి జనరల్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ గోపాల్‌రావు, సిద్దిపేట వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీధరాచారిలతో విచారణ కమిటీని నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు