Rythu Bharosa: రైతు భరోసాపై తుది కసరత్తు

Eenadu icon
By Telangana News Desk Published : 02 Jan 2025 04:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మంత్రివర్గ ఉపసంఘం నేడు మరోసారి భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: రైతు భరోసాపై మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు ఉపసంఘం గురువారం మరోసారి సమావేశం కానుంది. ప్రధాన అంశాలపై ఇప్పటికే ఉపసంఘం ఓ నిర్ణయానికి వచ్చినా, తుది సిఫార్సులు చేసే ముందు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామన్న ప్రభుత్వం.. నాలుగో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబులు సభ్యులుగా ఏర్పాటైన ఉపసంఘం ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించింది. పంట సాగు చేసిన ప్రతి కర్షకునికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో పంటలు సాగు చేశారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ రైతుబంధు కింద సాయం అందింది. అయితే గుట్టలకు, రోడ్లకు... ఇలా వ్యవసాయం చేసే అవకాశం లేని వాటన్నిటికీ ఇవ్వడం సమంజసం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం పంట సాగు చేసిన ప్రతి రైతుకు ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసా ఇచ్చేదే రైతుకు పెట్టుబడి అవసరాలకు కాబట్టి, అసలు పంట వేయని వారికి ఇవ్వడం సరికాదన్న అభిప్రాయంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పంట సాగు చేసిన రైతు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దీన్ని అధికారులు పరిశీలించి ఆమోదం తెలుపుతారని, శాటిలైట్‌ వినియోగించుకొని సమాంతరంగా తనిఖీ చేస్తారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం విస్తృతంగా సమీక్షించినా, గురువారం మరోసారి మార్గదర్శకాల గురించి చర్చించనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వం ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున ఆర్థికసాయం అందించగా, దీన్ని రూ.7,500కు పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఎకరాకు రూ.ఆరువేల చొప్పున ఇచ్చి క్రమంగా రూ.7,500 చేయాలనే అభిప్రాయానికి వచ్చినా, దీనిపై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రైతు భరోసా అమలుపై కూడా భిన్నాభిప్రాయాలు ఉండటంతో దీనిపై కూడా చర్చించనున్నారు. ఎవరినీ మినహాయించకుండా పంట వేసిన ప్రతి ఒక్కరికీ ఇవ్వడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఏడాదిలో రెండు పంటలు కాకుండా ఒకే పంట వేసే వారికి, పండ్లతోటలు, పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసే వారికి రైతు భరోసా ఎలా చెల్లించాలనే మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు