ఎప్పుడూ ఫోనే.. నా మాట వినట్లేదు!

మాకు 18, 16 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఇద్దరూ ఎప్పుడూ తమ ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. కనీసం ఇంటి పనుల్లో కూడా సహాయం చేయరు. ఒకవేళ ఫోన్లు తీసుకుంటే అలిగి పెద్ద గొడవ చేస్తుంటారు. తమ గదుల్లోకి వెళ్లి తలుపులు...

Published : 03 Jul 2023 21:07 IST

మాకు 18, 16 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఇద్దరూ ఎప్పుడూ తమ ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. కనీసం ఇంటి పనుల్లో కూడా సహాయం చేయరు. ఒకవేళ ఫోన్లు తీసుకుంటే అలిగి పెద్ద గొడవ చేస్తుంటారు. తమ గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు. వాళ్లు అలా చేస్తే నాకు ఆందోళన పెరిగిపోతుంటుంది. దాంతో వాళ్లు చెప్పినట్టే వింటున్నాను. పిల్లలు చదువులో కూడా వెనకబడిపోతున్నారు. వాళ్ల నాన్న ఉదయం ఇంటి నుంచి వెళితే ఎప్పుడో అర్ధరాత్రి తిరిగి వస్తారు. ఆయనకు చెబితే గొడవలు ఇంకా పెద్దవవుతాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు చెబుతున్న దానిని బట్టి మీ పిల్లలు మీ మాట వినే స్థాయి దాటిపోయినట్టుగా అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో తప్పనిసరిగా మీ జీవిత భాగస్వామి సహాయం తీసుకోవడం అవసరం. ఎందుకంటే వాళ్లు ఏమీ తెలియని చిన్న పిల్లలు కారు. ఏ విషయాన్నైనా అర్థం చేసుకునే వయసు వారిది. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ భర్తను ఈ విషయంలో ఇన్వాల్వ్‌ చేయండి. మీ పిల్లలు మీ మాట వినే స్థాయి దాటిపోయారంటే మీరు వాళ్లకు కావాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించడం లేదా? అనే విషయాన్ని పరిశీలించుకోండి. మీ భర్త ఉదయం వెళితే అర్ధరాత్రి దాకా రాడని అంటున్నారు. మీరు ఇంటి పని, వంట పనితో బిజీగా గడుపుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో.. ఓ తల్లిగా మీరు వారితో ఎంత సమయం గడుపుతున్నారు? వాళ్ల అభిరుచులను నెరవేర్చుకోవడానికి తగిన అవకాశం మీరు కల్పించడం లేదా? వాళ్లకు కావాల్సిన సంతోషాన్ని మీరు ఇవ్వడం లేదా?.. వంటి విషయాలను కూడా పరిశీలించుకోండి. ఒకవేళ ఇవన్నీ మీరు కల్పించినా కూడా మీతో కూర్చొని మాట్లాడడానికి వారు సిద్ధంగా లేరని భావిస్తే ఒకసారి వారిని సైకియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లండి. కేవలం మీ పిల్లలు మాత్రమే కాకుండా.. మీరు, మీ భర్త కూడా వారితో కలిసి వెళ్లండి. ఎందుకంటే మీ పిల్లలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ చాలా అవసరం. వారు అన్ని విషయాలను పరిశీలించి తగిన సలహా ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని