Earthquake in Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. భయానక దృశ్యాలు వైరల్‌

Eenadu icon
By International News Team Updated : 10 Oct 2025 10:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిండనోవా ద్వీపంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప (Earthquake in Philippines) తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో సునామీ (Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్‌ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరించింది.

మనీలాకు ఆగ్నేయాన 62 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప తీవ్రతతో అనేక భవనాలు కొన్ని సెకన్ల పాటు భారీగా కంపించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ప్రాంతంలో మరిన్ని సార్లు ప్రకంపనలు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. కొన్ని భవనాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు, ఫిలిప్పీన్స్‌ తీరంలో సముద్రం అల్లకలోలంగా మారింది. దాదాపు 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇండోనేసియా, పలావ్‌ తీరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. రెండు వారాల క్రితమే ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ విపత్తులో 72 మంది ప్రాణాలు కోల్పోయారు.



Tags :
Published : 10 Oct 2025 09:25 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు