H-1B Workers: హెచ్‌1బీ వీసా నిబంధనల మార్పు.. టెక్‌ దిగ్గజాల వ్యూహం మారనుందా?

Eenadu icon
By International News Team Updated : 21 Sep 2025 14:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: హెచ్‌1బీ వీసాల (H-1B Visa Fee ) ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తీసుకున్న నిర్ణయం ఆ దేశ లేబర్‌ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. కొన్ని రంగాల్లోని దిగ్గజ సంస్థలకు సమస్యాత్మకంగా మారనుంది. అమెరికా ఏటా 85 వేల హెచ్‌1బీ వీసాలను జారీ చేస్తోంది. దీనికి అదనంగా మరో 20 వేల వీసాలను అక్కడి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఇస్తోంది. ట్రంప్‌ నిర్ణయం నేపథ్యంలో వివేక్‌ రామస్వామి, ఎలాన్‌ మస్క్‌ విదేశీ ఉద్యోగుల సేవలను కంపెనీలు వాడుకోవడాన్ని సమర్థిస్తున్నారు. ట్రంప్‌ నిర్ణయాన్ని అక్కడి కంపెనీలు న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశాలున్నాయి. 

అమెరికాలో ఏ పరిశ్రమలపై ప్రభావం?

2024 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన హెచ్‌1బీ వీసాల్లో 64 శాతం కంప్యూటర్‌ సంబంధిత రంగాలకే దక్కాయి. ఈ విషయాన్ని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) వెల్లడించింది. ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, సర్వే రంగాలు 10 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. మూడో ప్లేస్‌లో 6 శాతం వీసాలతో విద్యా సంబంధితమైనవి ఉన్నాయి. కంప్యూటర్‌ రంగంలో ‘కస్టమ్‌ ప్రోగ్రామింగ్‌’ రంగానికే అత్యధికంగా 25 శాతం వీసాలు లభించాయి. అమెరికా టెక్‌ దిగ్గజాలు సింహ భాగం వీసాలను దక్కించుకున్నాయి. USCIS డేటా ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్‌ అత్యధికంగా 9000, గూగుల్‌ 5364, మెటా 4844, మైక్రోసాఫ్ట్‌ 4725, యాపిల్‌ 3873 వీసాలను స్పాన్సర్‌ చేశాయి. 

ఫీజు ఎఫెక్ట్‌ ఎలా ఉండొచ్చు..

అమెజాన్‌, మెటా, యాపిల్‌, ఆల్ఫాబెట్‌ కంపెనీలతో పోలిస్తే.. చిన్న కంపెనీలు, స్టార్టప్‌లు హెచ్‌1బీ వీసాలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తాయి. ఎందుకంటే ఈ నాలుగు కంపెనీల సంయుక్త మార్కెట్‌ విలువ 11.1 ట్రిలియన్‌ డాలర్లు. అందుకే ఇవి వీసాల రుసుము విషయంలో పెద్దగా వెనక్కి తగ్గే అవకాశం లేదు. కాకపోతే ఎంట్రీ లెవల్‌ పొజిషన్లలో విదేశీ ఉద్యోగులను ఈ సంస్థలు ఇక నియమించుకోకపోవచ్చు. తక్కువ జీతం ఇచ్చే వారి కోసం లక్ష డాలర్లు చెల్లించడాన్ని సంస్థలు భారంగా పరిగణించొచ్చు. అమెరికాలో కొత్తగా కళాశాల విద్యను పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు, కొవిడ్‌ 19 తర్వాత ఆర్థిక పరిస్థితులతో ఉద్యోగాలు లభించని వారికి ఇది శుభవార్తే. అక్కడి టెక్‌ సంబంధిత కోర్సుల్లో గ్రాడ్యూయేషన్‌ చేసిన వారికి అవకాశాలు లభించనున్నాయి.  ఇక హెచ్‌1బీ వీసాలకు మధ్యస్థంగా వార్షిక వేతనం 1,20,000 డాలర్లుగా ఉన్నట్లు USCIS నివేదిక చెబుతోంది. ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగులకు కంపెనీలు భారీగా చెల్లిస్తున్నాయని పేర్కొంది.

గతంలో ఫలితం ఎలా ఉంది..?

హెచ్‌1బీ వీసాలపై పరిమితులు విధించడం వల్ల ప్రభావితమైన రంగాల్లో అమెరికన్లనే నియమించుకొంటారనే హామీ ఏమీ లేదని సీఎన్‌ఎన్‌ కథనంలో పేర్కొంది. ట్రంప్‌ తొలి కార్యవర్గం సమయంలో కొన్ని రకాల వీసాలపై తాత్కాలిక బ్యాన్‌ విధించారు. ఆ తర్వాత కొవిడ్‌ వ్యాప్తితో నియామకాలు మందగించాయి. దీంతో రికార్డు స్థాయిలో నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దీంతో భారీగా ఉద్యోగుల కొరత ఉన్నట్ల తేలింది. అమెరికాలో కార్మికుల కొరత విదేశీ వలసలు లేకుండా భర్తీ కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2021 సీజన్లో ఆర్డర్లు వచ్చినా చేసేందుకు ఉద్యోగులు లేక చాలా సంస్థలు వ్యాపారాలను వదలుకున్నట్లు అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చీఫ్‌ పాలసీ ఆఫీసర్‌ నెయిల్ బ్రాడ్లీ 2021లో సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. 

అమెరికా విమాన టికెట్లు కావాలనే బ్లాక్‌ చేశారా? భారతీయులపై మాగా, 4చాన్‌ విద్వేషం!

కోర్టుల్లో సవాలు చేసే అవకాశం..

కొత్త హెచ్‌1బీ వీసాలకు అప్లికేషన్‌ ఫీజును పెంచుతూ ట్రంప్‌ తీసుకొన్న నిర్ణయాన్ని అక్కడి న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశం ఉంది. ఆ దేశ ఇమిగ్రేషన్‌ కౌన్సిల్ సీనియర్‌ ఫెలో ఆరోన్‌ రిచ్లిన్‌ ఎక్స్‌లో స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షుడు వీసా ఫీజును 1,00,000 డాలర్లకు పెంచే అధికారం లేదు. అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌కు అయ్యే వసూలు చేసుకొనే అధికారం మాత్రమే కాంగ్రెస్‌ నుంచి కార్యనిర్వాహక విభాగానికి లభించిన హక్కు’’ అని పేర్కొన్నారు. అమెరికా ఇమిగ్రేషన్‌ సర్వీస్‌ మాజీ సీనియర్‌ అధికారి డగ్‌ ర్యాండ్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ వద్ద  స్పందించారు. ‘అమెరికాలోకి విదేశీ ఉద్యోగులు అడుగు పెట్టకుండా ఫీజుతో అడ్డుకోవాలన్న ట్రంప్‌ ఆలోచన కోర్టుల్లో ఐదు సెకన్లు కూడా నిలబడదు’’ అని వెల్లడించారు. బైడెన్‌ వద్ద డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీలో సీనియర్‌ అటార్నీగా పనిచేసిన టామ్‌ జావెట్జ్‌ స్పందిస్తూ దేశంలో చట్టాలను అమలు చేయాల్సిన విధానం ఇది కాదని పేర్కొన్నారు. ట్రంప్‌ ఆదేశాలపై అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని దుష్ప్రభావం ఉద్యోగులు, వారి కుటుంబాలపై పడుతుందని పేర్కొంది. 

Tags :
Published : 21 Sep 2025 14:45 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు