CM Jagan: 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం.. ఈనెల 23న నోటిఫికేషన్‌

ఏపీలోని వర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో 3,295 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. 

Updated : 03 Aug 2023 18:01 IST

అమరావతి: ఏపీలోని వర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో 3,295 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. ఇందులో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులు, ట్రిపుల్‌ ఐటీల్లో 660 పోస్టులు భర్తీ చేయనున్నారు. నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

నిర్దేశించిన ప్రమాణాలతో అభ్యర్థులు కచ్చితంగా క్వాలిఫై కావాలన్న సీఎం.. నూటికి నూరుశాతం మెరిట్‌ ఉండాలన్నారు. ఇప్పటికే కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 10 మార్కులు వెయిటేజ్‌ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ఇంటర్వ్యూ టైమ్‌లో ఈ వెయిటేజ్‌ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థులు యూనివర్సిటీల నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో బయటకు రావాలంటే బోధనా సిబ్బంది నియామకాలు, అర్హత ప్రమాణాలు కచ్చితంగా నాణ్యతగా ఉండాలని సీఎం ఆదేశించారు.

యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీపై షెడ్యూల్‌, పరీక్షా విధానంపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ఆగస్టు 23న యూనివర్సిటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు.  సెప్టెంబరు 3, 4 వారాల్లో ఏపీపీఎస్సీ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్టోబరు 10కల్లా పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. రాత పరీక్ష ఫలితాలు విడుదల అనంతరం నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నవంబరు 15 నాటికి ఇంటర్వ్యూలు  సహా నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని, అదే రోజు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను యూనివర్సిటీలు వెల్లడించనున్నట్లు  అధికారులు తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని